దిగిరాని కేంద్రం.. ఢిల్లీలో ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఆందోళన
ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి వచ్చేసిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం తేల్చి చేప్పేయటం మరోసారి దేశంలో కలకలం రేపింది. కేంద్రం తీరుకు నిరసనగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆందోళనకు దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఉక్రెయిన్ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తోన్న భారతీయ వైద్య విద్యార్ధులు స్వదేశానికి వచ్చేశారు. దీంతో తమకు వైద్య విద్యను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని వారు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఎన్ఎంసీ చట్టం సవరించి న్యాయం చేయాలని విద్యార్ధులు ఆందోళన నిర్వహిస్తున్నారు. విద్యార్ధులుతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఇకపోతే.. ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్కు వచ్చిన వైద్య విద్యార్ధులకు లోకల్ కాలేజీలలో అడ్మిషన్లపై ఎన్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం విదేశాల నుంచి భారత్కు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ALso REad:అలా అవకాశం లేదు.. ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై తేల్చేసిన కేంద్రం
కాగా.. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించి నెలలు గడుస్తోంది.దీంతో ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుకొనేందుకు వెళ్లిన భారత విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే చదువును మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఉక్రెయిన్ లో ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో తమ చదువు, భవిష్యత్తుపై వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇండియాలోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో వైద్య విద్యార్ధులు కోరారు.
అయితే ఇప్పటికే ఉక్రెయిన్ నుండి తెలంగాణ నుండి వచ్చిన విద్యార్ధులను చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు సీఎం కేసీఆర్త. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్యార్ధుల చదువు విషయంలో సానుకూలంగా స్పందించింది.