ఉగ్రవాద చర్య వల్లే మంగళూరు ఆటో పేలుడు - కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
కర్ణాటక రాష్ట్రంలో ఆటో పేలుడు ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. దీని వెనక ఉగ్ర చర్య ఉందని చెప్పారు.
మంగళూరులో ఆటో రిక్షాలో సంభవించిన పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందని కాదని, అది ఉగ్రవాద చర్య అని కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ ఇది ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. పేలుడు ప్రమాదవశాత్తు కాదు కానీ తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశ్యంతో జరిగిన ఉగ్రవాద చర్య. దీనిపై కేంద్ర ఏజెన్సీలతో పాటు కర్ణాటక రాష్ట్ర పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపం.. రాహుల్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
కాగా.. ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ఏజెన్సీలు మంగళూరుకు చేరుకున్నాయని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆదివారం మీడియాకు తెలిపారు. “ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న కొంతమంది ఈ చర్య వెనుక ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. ఇప్పటికే మంగళూరు చేరుకున్న కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందించాం. మరో రెండు రోజుల్లో ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు, కారణం ఏంటనే విషయాలు తెలుసుకోవచ్చు ’’అని అని జ్ఞానేంద్ర అన్నారు.
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. అనంతనాగ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..
ఈ ఘటనపై మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక బృందం, ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్) బృందం సాక్ష్యాలను సేకరించి, సంఘటన వెనుక గల కారణాలను నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. కొంతమందికి గాయాలయ్యాయని చెప్పారు. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరూ సోషల్ మీడియా ద్వారా గందరగోళం సృష్టించి పుకార్లు పుట్టించకూడదని కోరారు. తమకు సమాచారం అందిన వెంటనే మీడియాకు తెలియజేస్తానని అన్నారు.
ఈ ఘటనతో సున్నిత ప్రాంతమైన మంగళూరులో కదులుతున్న ఆటోలో పేలుడు సంభవించింది. దీంతో సిటీ మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. దీంతో సిటీ మొత్తం పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. సిటీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయపడిన ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.