తమిళనాడులో విషాదం: మహిళను తొక్కి చంపిన ఏనుగు
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా బోడినాథంలో మేకల కాపరి వసంతను ఏనుగు తొక్కి చంపింది.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా బోడినాథంలో మేకలకాపరి వసంతను ఏనుగు తొక్కి చంపింది. మృతదేహన్ని కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఏనుగు నుండి వసంతను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. నిన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగే తమిళనాడు రాష్ట్రంలో మేకల కాపరి వసంత మృతికి కారణమని అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు.తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తుంది. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
నిన్న చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు. పొలంలో పనిచేస్తున్న దంపతులు సెల్వి, వెంకటేష్లపై ఏనుగు దాడి చేసింది.ఈ దాడిలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏనుగుల దాడిలో పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏనుగుల గుంపును గుర్తించిన స్థానికులు తరిమికొట్టారు. అయితే ఓ ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న బాలికను తొక్కి చంపింది. అదే ఇంట్లో మరొకరిపై కూడ దాడి చేసింది. దీంతో వీరిద్దరూ మృతి చెందారు.ఈ ఘటన ఈ ఏడాది మే 27న చోటు చేసుకుంది.
also read:చిత్తూరు రామాపురంలో ఏనుగు దాడి: దంపతుల మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు 12 రోజుల్లో 16 మందిని చంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏనుగు దాడిలో 12 మంది మృతి చెందారు.జార్ఖండ్ లోని ఐదు జిల్లాల్లో ఏనుగు దాడిలో 16 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు.హజారీబాత్, రామ్ఘడ్, ఛత్రా, హర్ధగా , రాంచీ జిల్లాల్లో ఏనుగు దాడిలో మరణాలు చోటు చేసుకున్నాయి.గుంపు నుండి తప్పిపోయిన ఏనుగు పలు జిల్లాల్లో దాడులకు పాల్పడింది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ ఏనుగు దాడిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 17న చోటు చేసుకుంది.