మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హత్యకు మావోల కుట్ర..?
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హత్యకు మావోల కుట్ర..?
ప్రధాని నరేంద్రమోడిని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం దేశంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలో మోడీని కూడా అంతమొందించేందుకు మావోలు పథకం రచించడం వీవీఐపీల భద్రతను ప్రశ్నిస్తోంది. ఈ పరిణామాల మధ్యలోనే మరో వీఐపీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను చంపేస్తామంటూ రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిని ఆ రాష్ట్ర హోంశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. వీటిని మావోయిస్టు సంస్థలే పంపినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ రెండు లేఖల్లోనూ ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల విషయం ప్రస్తావన ఉండటం.. నిఘా వర్గాల వాదనకు బలం చేకూరుస్తోంది. ఆ ఎన్కౌంటర్లకు ప్రతీకారంగానే ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపు లేఖలు పంపి ఉంటారని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏప్రిల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలకు, మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది నక్సల్స్ హతమయ్యారు.