loudspeaker row : లౌడ్ స్పీకర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లౌడ్ స్పీకర్ల నిబంధనలు ఎవ్వరూ ఉల్లంఘించకూడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు వస్తే సంబంధింత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
మతపరమైన ప్రార్థనా స్థలాల నుండి అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించిన తర్వాత ఎవరైనా అనవసరంగా లౌడ్ స్పీకర్లను అమర్చినా, లేకపోతే అధికంగా సౌండ్ పెట్టి ప్లే చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం చెప్పారు.
గోరఖ్పూర్లోని తన నివాసం నుండి రాష్ట్ర అధికారులను ఉద్దేశించి ఆదిత్యనాథ్ మాట్లాడారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్స్పీకర్లను తమ ప్రభుత్వం విజయవంతంగా ఎలా తొలగించిందో వివరించారు. చర్చల అనంతరం వివిధ మతపరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అనవసరమైన లౌడ్స్పీకర్లను తొలగించామని సీఎం తెలియజేశారు.
నిబంధనలను అమలు చేయడంలో అధికారులు విఫలమైతే, ఎవరైనా అనవసరంగా లౌడ్ స్పీకర్లను అమర్చినట్టు లేదా ప్లే చేసినట్టు ఫిర్యాదు వస్తే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ అనవసరమైన లౌడ్ స్పీకర్లను అమర్చడం, బిగ్గరగా ప్లే చేయడంపై ఏదైనా ఫిర్యాదు వస్తే సంబంధిత సర్కిల్ అధికారి, డిప్యూటీ కలెక్టర్, ఇతర బాధ్యులు వారిపై చర్యలు తీసుకుంటారు ’’ అని యోగి ఆదిథ్యనాథ్ స్పష్టం చేశారు. కాగా.. మతపరమైన సంస్థల్లో లౌడ్ స్పీకర్లను తొలగించే డ్రైవ్ ఏప్రిల్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మే 1వ తేదీ వరకు కొనసాగింది. ఇందులో నిబంధనలకు అనుగుణంగా లేని లౌడ్ స్పీకర్లను తొలగించింది. దీంతో పాటు కొన్ని లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ ను సెట్ చేసింది.
రాష్ట్రంలోని పలు చోట్ల అక్రమంగా నిర్వహిస్తున్న వాహనాల స్టాండ్లను నిర్మూలించేందుకు కచ్చితమైన ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి అధికారులకు అందించారు. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు రెండు రోజుల గడువు విధించారు. ‘‘ అక్రమ ట్యాక్సీ స్టాండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక యంత్రాంగంపై ఉంది. రోడ్లపై పార్కింగ్ ఉండకూడదు ’’ అని సీఎం అన్నారు.
air pollution: కాలుష్యంతో భారత్ లో 23.5 లక్షల మంది మృతి.. లాన్సెట్ నివేదిక ఆందోళన !
రోడ్డు ప్రమాదాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వాటి నివారణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈద్, రామనవమి, అక్షయ తృతీయ వంటి వివిధ పండుగల శాంతియుత వేడుకలను ప్రస్తావిస్తూ.. ఇవి సానుకూల సందేశాన్ని పంపించాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. దీనిని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే కేంద్ర మొదలు పెట్టారు. మసీదుల వద్ద ఆజాన్ కోసం ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. లౌడ్ స్పీకర్లను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లౌడ్ స్పీకర్ల సమస్య మతపరమైనది కాదని, అది ప్రజల సమస్య అని థాకరే అన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మే 3వ తేదీ నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలని పలు సందర్భాల్లో ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే హిందువులు ఈ ధార్మిక ప్రదేశాల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారని తెలిపారు. ఈ లౌడ్ స్పీకర్ల వివాదం ఒక రాష్ఠ్రం నుంచి మరో రాష్ట్రానికి పాకింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగింది.