Manipur: మిజోరం రాష్ట్రానికి మణిపూర్ సెగలు.. ‘మైతేయిలు వెళ్లిపోవాలి’.. భద్రత కల్పించిన ప్రభుత్వం
మణిపూర్ సెగలు మిజోరం రాష్ట్రాన్ని తాకాయి. మిజోరంలోని మైతేయిలు తమ స్వరాష్ట్రం మణిపూర్కు వెళ్లిపోవాలని, ఇక్కడ వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని మాజీ సాయుధ తిరుగుబాటుదారు సంఘం హెచ్చరించింది. దీంతో మిజోరం ప్రభుత్వం వారికి ప్రత్యేక భద్రత కల్పించింది.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మే 3వ తేదీన నుంచి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంఫాల్ లోయలో నివసించే మైతేయిలకు, కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే కుకీలకు మధ్య హింస పెచ్చరిల్లింది. మే 4వ తేదీన కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. మైతేయిలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మణిపూర్ రాష్ట్రంలోని పరిణామాల సెగలు పొరుగు రాష్ట్రమైన మిజోరాన్ని తాకాయి.
క్రిస్టియన్లు మెజార్టీగా ఉన్న మిజోరంలో మణిపూర్ నుంచి వెళ్లిన మైతేయిలకు వ్యతిరేకత ముప్పు ఏర్పడింది. మణిపూర్లోని ఆ ఘటనతో మైతేయిలపై తీవ్ర అసహనం ఉన్నదని, వారు వెంటనే తమ రాష్ట్రమైన మణిపూర్కు వెళ్లిపోవాలని, వారి ప్రాణాలకు వారే బాధ్యులని మాజీ తిరుగుబాటు దారులు ఓ పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మిజోరం ప్రభుత్వం వారికి ప్రత్యేక భద్రత కల్పించింది.
మణిపూ్ర్లో ఇద్దరు జో (కుకీ) తెగ మహిళలపై దాష్టీకానికి పాల్పడిన ఘటన మిజో సెంటిమెంట్లపై బలంగా ప్రభావం వేసిందని పీస్ అకార్డ్ ఎంఎన్ఎఫ్ రిటర్నీల అసోసియేషన్ (పామ్రా) పేర్కొంది. జో మహిళలపై జరిగిన దాడితో మిజో యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయని వివరించింది. మిజోరంలో మైతేయిలకు ఏమైనా హాని జరిగితే అందుకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించింది. ఇక్కడి పరిస్థితులు మైతేయిలకు ప్రతికూలంగా ఉన్నాయని, కాబట్టి, వారు తిరిగి వారి స్వరాష్ట్రం మణిపూర్కు వెళ్లిపోవడం మంచిదని సూచనలు చేశారు.
మిజోరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మైతేయిలు కూడా ఉన్నారు. కానీ, వారు కేవలం మణిపూర్ మైతేయిలను మాత్రమే వెళ్లిపోవాలని చెప్పారు.
మణిపూర్ రాష్ట్రంలో సుమారు 53 శాతం జనాభా మైతేయిలే. వీరు మైదానాల్లో నివసిస్తున్నారు. అదే కుకీ, నాగా తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మైతేయిలు హిందుత్వ వైపు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు. కాగా, కుకీలు క్రిస్టియన్లు, మైనార్టీలు.
మైతేయిలకు ఈ పిలుపు రావడంతో మిజోరం ప్రభుత్వం వారికి భద్రత కల్పించింది. ఈ రాష్ట్ర సీఎం జోరంథంగా.. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు.