ఔరంగజేబు మాకు స్పూర్తి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఔరంగజేబు కుటుంబాన్ని పరామర్శించిన నిర్మలా సీతారామన్
శ్రీనగర్: ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన అమర జవాన్ ఔరంగజేబు కుటుంబసభ్యులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు పరామర్శించారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో నివసిస్తున్న ఔరంగజేబు కుటుంబసభ్యులను ఆమె కలుసుకొన్నారు.వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు.
అమరవీరుడి కుటుంబసభ్యులతో కాసేపు సమయాన్ని గడిపేందుకు ఇక్కడికి వచ్చాను. వీళ్ల దగ్గర నుంచి ఓ చక్కటి సందేశాన్ని నాతో తీసుకువెళ్తున్నాను. అమరజవాను మాతో పాటు, దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఆమె చెప్పారు.
ఔరంగజేబు తండ్రి కూడా ఆర్మీలో తన సేవలను అందించారు. రంజాన్ పండుగ సందర్భంగా రాజౌరిలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు అతడిని అడ్డగించి అపహరించుకుపోయారు.
అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఔరంగజేబు కుటుంబసభ్యులను సోమవారం భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పరామర్శించారు. తన కొడుకును చంపిన వాళ్లని 72గంటల్లోగా కేంద్రం పట్టుకొని కాల్చేయాలని జమ్ముకశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులను, ఉగ్రవాదులను రాష్ట్రం నుంచి తరిమివేయాలని ఆయన తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఔరంగజేబును హత్య చేయడానికి ముందు ఉగ్రవాదులు అతడిని ఓ అజ్ఞాత ప్రదేశానికి తరలించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత ఔరంగజేబు తల, మెడపై కాల్చి మృతదేహాన్ని పుల్వామా వద్దనున్న గుస్సో గ్రామం దగ్గర పడేశారు.