BJP: ఇప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో బీజేపీ 136-159 సీట్లతో పూర్తి మెజారిటీ సాధిస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 62-82 సీట్లతో, జేడీ(ఎస్) 3-6 సీట్లను మాత్రమే గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది.

BJP: కర్ణాటకలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలిసారిగా పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పీపుల్స్ పల్స్, కోడెమో టెక్నాలజీస్ నిర్వహించిన సర్వే తెలిపింది.

ఒక నెల పాటు 10,481 మందితో చేసిన ఈ సర్వే ప్రకారం.. 224 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 136 నుండి 159 సీట్లను గెలుచుకుంటుంది. కాంగ్రెస్ 62 నుండి 82 సీట్లు, జేడీ(ఎస్) 3 నుండి 6 సీట్లు గెలుచుకుంటాయి. 

ద్విముఖ పోరు.. జేడీ(ఎస్) వెనుకంజ

ఈ సర్వే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీని వెల్లడిస్తుంది, ఇందులో జేడీ(ఎస్) వెనుకడుగు వేస్తుంది. 2023 ఎన్నికల్లో 18.3% ఓట్లను సాధించిన జేడీ(ఎస్) ఇప్పుడు కేవలం 5% ఓట్లకే పరిమితం కానుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 2023లో 42.88% నుండి 40.3%కి తగ్గే అవకాశం ఉంది.

గత రెండు దశాబ్దాలుగా కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోంది, 2004, 2008, 2018లలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇంతవరకు స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది.

సీఎ గా సిద్ధరామయ్యకే ప్రజాదరణ

సర్వేలో బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే సీఎం పదవికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది. సుమారు 29.2% మంది సిద్ధరామయ్యను సీఎంగా కోరుకుంటున్నారు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు 10.7% మంది మద్దతు ఇచ్చారు.

బీజేపీ సీఎం అభ్యర్థుల్లో ఎవరూ రెండంకెల మార్కును దాటలేకపోయారు. బీ.ఎస్. యడియూరప్పకు 5.5%,  బీవై. విజయేంద్రకు 5.2%, బసవరాజ్ బొమ్మైకి 3.6% మద్దతు లభించింది. ఆసక్తికరంగా 16.9% మంది బీజేపీలో ఎవరైనా సరే అని తమ మద్దుతు ప్రకటించారు. 

కాంగ్రెస్ పాలనకు మిశ్రమ స్పందన

48.4% మంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును "చాలా బాగుంది" లేదా "బాగుంది" అని అంచనా వేయగా, 51.6% మంది "సాధారణం" లేదా "పేలవంగా" ఉందని అన్నారు.

గృహలక్ష్మి పథకానికి మంచి ఆదరణ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు హామీలలో, గృహలక్ష్మి పథకానికి అత్యధిక ఆదరణ లభించింది. 45.4% మంది ఈ పథకాన్ని సమర్థించారు.

కుల గణనపై భిన్నాభిప్రాయాలు

42.3% మంది కుల గణన ఫలితాలను పూర్తిగా (26.3%) లేదా పాక్షికంగా (16%) విశ్వసిస్తున్నట్లు చెప్పారు. 35% మంది దానిని నమ్మడం లేదని, 22.7% మంది దాని విషయం తెలియదని అన్నారు.