కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 13 మంది మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. ఎవరెవరంటే ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోని 13 మంది మంత్రులు ఓడిపోయారు. వారంతా బీజేపీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. కింగ్ మేకర్ గా మారుతుందనుకున్న జేడీఎస్ కూడా చతికిలపడిపోయింది. ఆ పార్టీ 20 స్థానాలు కూడా దాటలేకపోయింది. అయితే వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలని చూసిన బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోని 13 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. అందులో అనేక మంది బీజేపీ సీనియర్ నేతలుగా ఉన్నారు.
జయనగర్లో తొలుత కాంగ్రెస్ గెలుపు.. రీ కౌంటింగ్ తర్వాత 16 ఓట్లతో ఓటమి.. ఈసీకి ఫిర్యాదు..!!
ఓడిన ముఖ్య నాయకులు ఎవరంటే ?
సిర్సీ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత, స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఓటమిపాలయ్యారు. అలాగే మరో మంత్రి ఆర్ అశోక కూడా పద్మనాభనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గెలుపొందారు. వరుణ నియోజకవర్గంలో మంత్రి సోమన్న ఓడిపోయారు. అక్కడి నుంచి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజయం సాధించారు. అయితే సోమన్న పోటీ చేసిన మరో స్థానమైన చామరాజనగర్ లో కూడా ఆయనకు పరాజయమే ఎదురైంది. కాగా.. సోమన్న లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు.
బాగల్ కోట్ జిల్లాలోని బిలగి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరానీ లింగాయత్ కూడా ఓటమి పాలయ్యారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు. అలాగే గనులు, భూగర్భ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న హాలప్ప ఆచార్.. యెల్బుర్గా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
విషాదం.. ఈత కోసం వెళ్లి.. కృష్ణసాగర్ సరస్సులో మునిగి ఐదుగురు బాలుల మృతి..
నవల్గుండ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన చేనేత, జౌళి, చక్కెర శాఖ మంత్రి శంకర్ పాటిల్ మునెకొప్ప కూడా అపజయం పాలయ్యారు. బీజేపీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీసీ పాటిల్ హిరేకెరూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బసవనప్ప ఉజనేశ్వర్ చేతిలో 15,020 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు.
పాఠశాల విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తిప్పూరులో కాంగ్రెస్ అభ్యర్థి కే షాదాక్షరి చేతిలో ఓడిపోయారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన షాదాక్షరి.. ఈ సారి 17,652 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కర్ణాటకలో అత్యంత సంపన్న అభ్యర్థి అయిన చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్చెగౌడ చేతిలో 4,787 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాగా.. శనివారం అర్ధరాత్రి వరకు ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 65 స్థానాల్లో గెలుపొందింది. జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లతో సరిపెట్టుకుంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. నిన్న కౌంటింగ్ జరిపారు.