జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ని మరోసారి మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.సరిహద్దుల్లో డ్రోన్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ: జమ్మూ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ సంచారంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో జమ్మూ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. డ్రోన్ కదలికలు జమ్మూ ప్రాంతంతో పాటు సాంబా, కత్వా, పఠాన్‌కోట్ వంటి ప్రదేశాల్లో కూడా కనిపించాయని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో విమాన రాకపోకలపై ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసులను నిలిపివేసినట్టు ప్రకటించింది. జమ్మూ నుంచి అమృత్‌సర్, లేహ్, రాజ్‌కోట్, జోధ్‌పూర్, శ్రీనగర్, చండీగఢ్ వంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. ఇండిగో కూడా భద్రతా పరిస్థితుల దృష్ట్యా తన సేవలను నిలిపివేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, డ్రోన్ భారత సరిహద్దులను దాటి లోనికి ప్రవేశించలేదని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంపై పాకిస్తాన్‌కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.డ్రోన్ కదలికలపై మిలిటరీ, సైనిక బలగాలు సమగ్రంగా మోనిటరింగ్‌ చేస్తున్నాయి. ఏదైనా అనూహ్య ఘటన జరిగి భద్రతా లోపాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలతో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అప్రమత్తతతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు తమ విమానాల సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.