సారీ.. కానీ, నా వ్యాఖ్యలు సుస్పష్టం.. ఆ సినిమా అలాంటిదే: ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లాపిడ్
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వల్గర్ ప్రాపగాండ మూవీ అని సంచలనానికి తెర లేపిన ఇజ్రాయెలీ దర్శకుడు, ఐఎఫ్ఎఫ్ఐ ప్రెసిడెంట్ నడవ్ లాపిడ్ తాజాగా మరోసారి స్పందించారు. 1990లో ట్రాజెడీకి బలైన కశ్మీరీ పండిట్లు, వలస వెళ్లిన పండిట్లు, వారి బంధువులను తాను కించపరచలేదని, అలాంటి ఉద్దేశం లేదని అన్నారు. ఆ కోణంలో తన వ్యాఖ్యలను తీసుకుంటే క్షమాపణలు అని చెబుతూనే తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) వేదికగా ఇంటర్నేషనల్ జ్యూరీ చైర్పర్సన్, ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఒక జ్యూరీ సారథిగా ఆయన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పై చేసిన కామెంట్లు సినీ ప్రముఖుల నుంచే కాదు.. రాజకీయ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి. ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు కార్యక్రమంలో నడవ్ లాపిడ్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక వల్గర్ ప్రాపగాండ మూవీ అని కామెంట్ చేశారు. తాజాగా,ఆయన ఇజ్రాయెలీలో మరోసారి ఈ వ్యాఖ్యలపై స్పందించారు.
1990లో జరిగిన విషాదంలో మరణించిన, లేదా వలసవెళ్లిపోవాల్సిన వచ్చిన కశ్మీరీ పండిట్లను లేదా వారి బంధువులను కించపరచడం లేదని, బాధితులను తాను గాయపరచ లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఒక వేళా ఆ కోణంలో తీసుకుంటే క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, బాధితులు ఎవరినీ గాయపరచాలనేది తన లక్ష్యం కానే కాదని సీఎన్ఎన్ న్యూస్ 18కు బుధవారం రాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అదే సందర్భంలో తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ‘అదే సమయంలో నేను ఏదైతే అన్నానో.. ఆ వ్యాఖ్యలు వాస్తవమే. నేను, నా తోటి జ్యూరీ సభ్యులు కూడా ఆ సినిమా ఒక వల్గర్ ప్రాపగాండగానే చూశారు. అలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా పోటీ పడటం సరికాదు. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పమన్నా చెబుతాను’ అని అన్నారు.
అయితే, తాను కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న విషాదం గురించి మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. వారి పట్ల తనకు సానుభూతి ఉన్నదని తెలిపారు. తాను కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నామని చెప్పారు. అలాంటి ఘటనపై సీరియస్ ఫిలిం ఉండాలని పేర్కొన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే సినిమాటిక్ మ్యానిపులేషన్లో ఉన్నదని చెప్పారు. వాయిలెన్స్, విద్వేషం చిమ్మడానికే ఈ సినిమాను వినియోగించుకున్నట్టు తామంతా భావించామని ఆయన వివరించారు.
తన వ్యాఖ్యలపై ఆ సినిమా డైరెక్టర్ సీరియస్ కావడం సహజమే అని అన్నారు. ‘ఆ డైరెక్టర్ సీరియస్ కచ్చితంగా సీరియస్ అవుతాడు. నా సినిమా గురించి కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే నేను కూడా అలాగే సీరియస్ అవుతాను. నా సినిమాలను చాలా వరకు కాంట్రవర్షియల్గానే చూస్తుంటారు. కొందరు మరీ కటువైన పదాలను నా సినిమాపై సంధిస్తుంటారు’ అని తెలిపారు.
కేన్స్, బెర్లిన్ వంటి పెద్ద ఫిలిం ఫెస్టివల్స్ జ్యూరీ అధ్యక్షుడిగా తాను వ్యవహరించానని, అదే విధంగా గోవాకూ తనను ఆహ్వానించారని వివరించారు. అందుకు బద్దుడినై తాను ఏమి చూశానో అది చెప్పడం తన బాధ్యత అని తెలిపారు.