స్వేఛ్చగా మాట్లాడలేని ఇలాంటి దేశాల్లో ఎవరో ఒకరు నోరువిప్పాలి.... ది కాశ్మీర్ ఫైల్స్ వివాదంపై నడవ్ లాపిడ్ వివరణ
ఇజ్రాయిల్ దేశ ఫిల్మ్ మేకర్ ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం తెరకెక్కిన చెత్త సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వాఖ్యలను దుమారం రేపగా... నడవ్ స్పందించారు.
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని గోవా వేదికగా జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ గా ఉన్న నడవ్ లాపిడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ది కాశ్మీర్ ఫైల్స్ వల్గర్ మూవీ, ప్రోపగాండా ఆధారంగా తెరకెక్కింది. ఆ మూవీ మమ్మల్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి చెత్త చిత్రాన్ని ప్రదర్శించకూడదు, అన్నారు.
నడవ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముఖ్యంగా ది కాశ్మీర్ ఫైల్స్ టీమ్ స్పందించారు. నడవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాన పాత్ర చేసిన అనుపమ్ ఖేర్... 1990లో లక్షల మంది కాశ్మీర్ పండిట్స్ హింసకు గురయ్యారు. వారి వేదన ప్రపంచానికి తెలియకుండా దాచారు. ఆ బాధితుల్లో నేను కూడా ఒకడిని. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాధితులైన 500 మంది కాశ్మీర్ పండిట్స్ ని ఇంటర్వ్యూ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది, అని నడవ్ వ్యాఖ్యలను ఖండించారు.
నడవ్ కామెంట్స్ ఇండియాలో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నడవ్ లాపిడ్ మరోసారి స్పందించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ ప్రజలకు ముడిపడి ఉందని నాకు తెలుసు. అలాగే ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ గా గొప్ప బాధ్యత కలిగి ఉన్నాను. నా జాబ్ అంత ఈజీ కాదు. ఇక్కడి వారు నన్ను బాగా చూసుకున్నారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. అదే సమయంలో దాడి కూడా చేశారు. ఏం జరుగుతుందో అన్న ఆందోళన నన్ను వెంటాడింది. ఇండియాలో ఉన్నంతసేపు నేను భయంతో గడిపాను. క్షేమంగా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నందుకు సంతోషంగా ఫీల్ అయ్యాను.
స్వేఛ్ఛగా నిజాన్ని చెప్పే శక్తి ప్రజలకు లేని చోట ఎవరో ఒకరు మాట్లాడాలి. అందుకే నేను కాశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి నా అభిప్రాయం తెలియజేశాను. నా దేశ పరిస్థితులను చూసిన నేను ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి మాట్లాడాలి అనుకున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి మూవీ రాలేదు. అయితే భవిష్యత్ లో రావచ్చు, అని చెప్పుకొచ్చారు. పరోక్షంగా నడవ్ రాజకీయ ఎజెండాలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాను ప్రోత్సహించకూడదు. అది సమాజానికి మంచిది కాదు. భారత్ లో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే శక్తిని కలిగి లేరన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.