తమిళనాడులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ రూమ్ లో విగతజీవిగా కనిపించిన బాలిక
తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ నుంచి హాస్టల్ రూమ్ కు వచ్చిన తరువాత ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.
తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చిలో విద్యార్థి మృతి ఘటన మరవకముందే ఇది చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కిలాచేరిలోని ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి తన హాస్టల్ గదికి వెళ్లింది. అయితే రెండు గంటలైనా తిరిగి రాకపోవడంతో పాఠశాల అధికారులు హాస్టల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఆమె గది తలుపులు తీసుకొని వెళ్లగా ఆత్మహత్య చేసుకొని కనిపించింది.
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) ఎం సతప్రియ, తిరువళ్లూరు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సెఫాస్ కళ్యాణ్ పాఠశాలకు చేరుకుని ఈ విషయంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై తిరువళ్లూరుకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ‘హిందుస్థాన్ టైమ్స్’తో మాట్లాడారు. ‘‘ ఇది కేవలం ఆత్మహత్య కేసు. మరేదీ కాదు. మేము ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము.’’ అని తెలిపారు.
కాగా జూలై 13న కల్లకురిచిలోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్ ఆవరణలో 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలిక చదువుతున్న ప్రైవేట్ పాఠశాలను బంధువులు ధ్వంసం చేశారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉన్న బస్సులను, ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింద. ఈ హింసాత్మక నిరసనల సమయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో సుమారు 52 మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.
West Bengal SSC scam: జైలు నుంచి మమతా బెనర్జీకి ఫోన్ చేసిన మంత్రి పార్థ ఛటర్జీ.. కానీ..
ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్-క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీబీ-సీఐడీ) విచారిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. మద్రాసు హైకోర్టు ఈ కేసు విషయంలో మాట్లాడుతూ.. విద్యా సంస్థలో ఏదైనా మరణం సంభవిస్తే తప్పనిసరిగా సీబీ-సీఐడీ ద్వారా విచారించాలని ఆదేశించింది. కాగా అంతకు ముందు బాలిక మృతి అనుమానంగా ఉందని తల్లిదండ్రులు కోర్టుకు విన్నవించారు. దీంతో రెండో సారి పోస్టు మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.