‘‘అఖిలేష్ తన మామ, మరదల్నే కంట్రోల్ చేయలేడు.. ఇక నన్నెలా కంట్రోల్ చేస్తాడు’’ - ఎస్బీఎస్పీ చీఫ్ రాజ్ భర్
అఖిలేష్ యాదవ్ తన కుటుంబ సభ్యులనే కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఇక తనను ఎలా కంట్రోల్ చేయగలరని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎబ్బీఎస్పీ చీఫ్ రాజ్ భర్ అన్నారు. అఖిలేష్ ఏసీ రూమ్ లోనే కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన మేనమామ శివపాల్ యాదవ్, మరదలు అపర్ణ యాదవ్ లనే కంట్రోల్ చేయలేకపోతున్నాడని, అలాంటప్పుడు ఆయన నన్నెలా కంట్రోల్ చేయగలడని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్ భర్ అన్నారు. జౌన్ పూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అఖిలేష్ యాదవ్ పై విమర్శలు చేశారు. సమాజ్ వాదీ చీప్ ఎవరి మాట వినడం లేదని అన్నారు. ఆయన ఫీల్డ్ లో పనిచేయడానికి బదులుగా ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ నుంచి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
West Bengal SSC scam: జైలు నుంచి మమతా బెనర్జీకి ఫోన్ చేసిన మంత్రి పార్థ ఛటర్జీ.. కానీ..
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఇక ఏమాత్రం పొత్తు పెట్టుకోదని రాజ్ భర్ స్పష్టం చేశారు. కాగా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక తమ పార్టీ మాయావతి బహుజన్ సమాజ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు.ఇటీవల కూడా రాజ్ భర్ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చారు. అయితే కొంత కాలం తరువాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కలిగించింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం రేకెత్తించాయి.
ఇతర పార్టీలతో కలిసి పని చేయడంపై వ్యాఖ్యానించాలని మీడియా ప్రశ్నించినప్పుడు.. ‘‘ మేము బీఎస్పీతో కలిసి పని చేయాలని కొంత మంది పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్పీతో మనం మాట్లాడాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.’’ అని ఆయన అన్నారు. ఆజంగడ్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ మంచి ప్రదర్శన కనబరిచిందన్నారు. అఖిలేష్ యాదవ్ తో పోలిస్తే మాయావతి ఎక్కువ సమయం ఈ రంగంలో గడుపుతారని బీఎస్పీ అధినేత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు.
President Droupadi Murmu : తన పేరు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న రాష్ట్రపతి..
అయితే రాజ్ భర్ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. తన మామ, ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్పీఎల్) అధినేత శివపాల్ సింగ్ యాదవ్, ఎస్బీఎస్పీ చీఫ్ రాజ్ భర్ లకు ‘ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంది’ అని అన్నారు. ‘‘ సమాజ్ వాదీ పార్టీ నిరంతరం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో నిరంతరం పోరాడుతూనే ఉంది. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుని, దానిని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి.. మీకు అక్కడ మరింత గౌరవం లభిస్తుందని భావిస్తే మీరు స్వేచ్ఛగా వెళ్లవచ్చు’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఇదిలా ఉండగా.. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ, రాజ్ భర్ కు చెందిన ఎస్బీఎస్పీ, శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా), కేశవ్ దేవ్ మౌర్యకు చెందిన మహాదళ్, అప్నాదళ్ (కమెరావాడి), జనవాదీ పార్టీలతో కలిసి పోటీ చేసింది. అయినప్పటికీ ఆ పార్టీలు మొత్తం కలిపినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాలేదు. రెండో సారి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి బాధ్యతలు చేపట్టారు.