Aadhaar-Voter ID Link: ఆధార్తో ఓటర్ ఐడీ లింక్.. విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు .. ఏమన్నదంటే..?
Aadhaar-Voter ID Link: ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధానం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Aadhaar-Voter ID Link: ఆధార్తో ఓటరు ఐడీని అనుసంధానం చేయాలని కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల చట్టంలో సవరణను సవాలు చేస్తూ దాఖలైన ఇదే పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాబట్టి పిటిషన్ను పరిష్కరిస్తున్నామనీ. పిటిషనర్ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఈ చట్టంలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలున్నాయని పిటిషనర్ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ఈ చట్టాన్ని అమలు చేయడం దేశ పౌరుల గోప్యత, సమానత్వపు హక్కులకు ఉల్లంఘన జరుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్నిరద్దు చేయాలని సూర్జేవాలా తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం ఆధార్ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, వాటిని ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేస్తే పేద ఓటర్లు ఎక్కువగా నష్టపోతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఆధార్ వివరాలను పంచుకోవడం స్వచ్ఛందమనీ, కానీ చేయని వారు తగిన కారణాలను ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డేటాను ఆధార్తో లింక్ చేయడం పౌరుల గోప్యత యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని రణదీప్ సూర్జేవాలా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్లోని డేటాతో ఆధార్ డేటాను లింక్ చేయడం ద్వారా, ఓటర్ల వ్యక్తిగత సమాచారం.. చట్టబద్ధమైన అథారిటీకి అందుబాటులో ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలా ఆధార్–ఓటర్ ఐడీ లింకింగ్ కారణంగా దేశ పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న కాంగ్రెస్ !
ఇది ఓటర్ల గుర్తింపు ఆధారంగా బెదిరింపు/ఓటింగ్ నిరాకరించే అవకాశాలను కూడా పెంచుతుందని పిటిషన్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ గళం విప్పింది. దీనిపై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చు.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆధార్ను ఎలక్టోరల్ డేటాతో అనుసంధానం చేయాలని సన్నాహాకాలు ప్రారంభించింది. ఇలా చేయడం వల్ల ఎన్నికల జాబితాలో పేర్లు పునరుక్తం కాకుండా, జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉంటాయని, ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదనేదే తమ ఉద్దేశమని పేర్కొంటోంది. అయితే.. వ్యక్తిగత గోప్యత దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానం ఐచ్ఛికమననీ, తప్పనిసరి కాదని పేర్కొంది.