చైనా సైన్యం చర్యలను తిప్పికొట్టాం: తవాంగ్ ఘర్షణలపై లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
పార్లమెంట్ లో తవాంగ్ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు ప్రకటన చేశారు. చైనా ఆర్మీని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు.
న్యూఢిల్లీ: చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అరుణాచాల్ ప్రదేశ్ తవాంగ్ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు లోక్సభలో ప్రకటన చేశారు. తవాంగ్ ఘటనలో చైనా, ఇండియాకు చెందిన సైనికులు గాయపడినట్టుగా రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. చైనా ప్రయత్నాలను భారత సైనికులు తిప్పికొట్టారని కేంద్ర మంత్రి చెప్పారు.
చైనా సైనికులను భారత ఆర్మీ అత్యంత ధైర్యంగా ఎదుర్కొందన్నారు. భారత సైనికుల పరాక్రమానికి తాను సెల్యూట్ చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. దేశ రక్షణకు తమ ప్రభుత్వం నిబద్దతతో కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ నెల 9వ తేదీన చైనా ఆర్మీ భారత భూభాగంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ నిలువరించిందని లోక్ సభలో ఆయన వివరించారు. చైనా ఆర్మీ తమ స్థావరానికి వెళ్లేలా భారత ఆర్మీ చేసిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. చైనాతో ఉన్న సరిహద్దును కాపాడేందుకు భారత ఆర్మీ నిరంతరం పనిచేస్తుందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.భారత సరిహద్దులను భారత సైన్యం కాపాడుతుందన్నారు.ఈ ప్రయత్నాలను ఆపేందుకు ఎవరూ ప్రయత్నించినా అడ్డుకుంటామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.
సరిహద్దు ఘర్షణల్లో భారత సైనికులు ఎవరూ చనిపోలేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.ఇండియన్ ఆర్మీకి చెందిన ఎవరికీ కూడా గాయాలు కాలేదని కేంద్రమంత్రి వివరించారు. ఇండియన్ ఆర్మీ ధైర్యాన్ని అభినందించాల్సిందేనన్నారు. చైనా కుతంత్రానికి మన సైనికులు ధీటుగా బదులిచ్చారని మంత్రి తెలిపారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9వ తేదీన ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్ఏసీ వద్ద ఈ ఘర్షణ జరిగింది. చైనాకు చెందిన సైన్యం భారత్ వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాల సైనికులు తిరిగి వెళ్లారు.
also read:అరుణాచల్ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఉద్రిక్తత: ఇండియా, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ
తవాంగ్ ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తవాంగ్ సెక్టార్ లో ఏం జరిగిందనే దానిపై సమాచారం సేకరించారు. రక్షణ శాఖాధికారులతో సమావేశం పూర్తైన తర్వాత లోక్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు నిశ్శబ్బంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు.కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన తర్వాత విపక్షాలు పార్లమెంట్ నుండి వాకౌట్ చేశారు.