పాకిస్థాన్ ఉగ్ర మద్దతు భండాఫాయికి భారత్ ఏడు ఎంపీల బృందాలను 32 దేశాలకు పంపిస్తుంది. ఉగ్రవాదంపై ప్రపంచ మద్దతు సేకరించేందుకు ఈ దౌత్య చర్య చేపట్టినట్లు తెలుస్తుంది.

పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ కేవలం సైనిక దాడులతో ఆగిపోలేదు. అదే సమయంలో దౌత్యరంగంలోను సమాంతరంగా కీలక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం క్షిపణి దాడులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును బహిర్గతం చేయడం లక్ష్యంగా, భారత్ ఈసారి అనూహ్యంగా డిప్లొమాటిక్ కార్యాచరణ ప్రారంభించింది.

32 దేశాలకు

దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు పార్లమెంటరీ సభ్యులతో కేంద్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు మొత్తం 32 దేశాలకు వెళ్లి పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతు, ఆపరేషన్ సిందూర్ లక్ష్యం, భారత్ తీసుకున్న చర్యల ప్రాముఖ్యతను వివరిస్తారు. ఈ బృందాల పర్యటన ద్వారా దేశానికి ఉన్న అంతర్జాతీయ మద్దతును పటిష్టపరచే యత్నం జరుగుతోంది.

శశిథరూర్ అమెరికా..

ఈ బృందాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన శశిథరూర్ నేతృత్వంలో ఒక బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు వెళ్తోంది. మరోవైపు డీఎంకే నేత కనిమొళి స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా దేశాల్లో పర్యటించనున్నారు. ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఈజిప్టు, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలో పర్యటన చేస్తారు. బీజేపీ నాయకుడు బైజయంత్ పాండా సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాను సందర్శించనున్నారు.

బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాలకు వెళ్తోంది. జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలలో ప్రచారం నిర్వహిస్తారు. శివసేనకు చెందిన శ్రీకాంత్ శిండే యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియొర్రా లియోన్ దేశాల్లో పర్యటించనున్నారు.

ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎత్తిచూపించాలన్న..

ఈ అన్ని బృందాల దౌత్యపరమైన పర్యటనకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేతృత్వం వహిస్తోంది. మంత్రి కిరణ్ రిజిజు ఈ వివరాలను ఇటీవల వెల్లడించారు. దేశ రాజకీయాలను పక్కకు పెట్టి, ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎత్తిచూపించాలన్న ఉద్దేశంతో కేంద్రం అన్ని పార్టీల ఎంపీలను ఈ బృందాల్లో భాగస్వాముల్ని చేసింది.

ఈ చర్యల ద్వారా భారత్, పాకిస్థాన్ ఉగ్ర మద్దతు వ్యవహారాన్ని కేవలం ద్వైపాక్షిక సమస్యగా కాకుండా, అంతర్జాతీయ భద్రతా అంశంగా పరిచయం చేయాలనుకుంటోంది.