ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ సత్ఫలితాలను ఇస్తోంది. దీనిలో భాగంగా రక్షణ రంగంలో తొలిసారి ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్లను దాటింది. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటించింది.
భారతదేశం గతంలో తన రక్షణ అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రతియేటా లక్షల కోట్లను ఖర్చు చేసేది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడటం తగ్గించడంతో పాటు మనమే విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. రక్షణ ఉత్పత్తులు తొలిసారి లక్ష కోట్ల మార్క్ చేరుకుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 95 వేల కోట్లు కాగా.. కేంద్రం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఏడాది ఉత్పత్తి విలువ పెరిగిందని రక్షణ శాఖ తెలిపింది.
ఇక ప్రస్తుతం నమోదైన రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.06 లక్షల కోట్లు వుంటుందని తెలిపారు. మరికొన్ని ప్రైవేట్ సంస్థల నుంచి రావాల్సిన ఇంకా డేటా అందలేదని.. అది కూడా వస్తే దీని విలువ మరింత పెరుగుతుందని కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే రక్షణ ఉత్పత్తుల విలువ 12 శాతం పెరిగిందని కేంద్రం వెల్లడించింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం జారీ చేసిన రక్షణ లైసెన్సుల సంఖ్య దాదాపు 200 శాతం పెరిగిందని తెలిపింది.
2015-16 ఏడాది నుంచి భారత రక్షణ రంగ పరికరాలపై కేంద్రం బడ్జెట్ను పెంచింది. అలాగే సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు సహా రక్షణ రంగంలో వ్యాపారాన్ని సులభంగా నిర్వహించేందుకు గాను కేంద్రం పలు సంస్కరణలు చేపట్టింది. ఈ కృషి ఫలితంగానే ఈ విజయం నమోదైంది.
