భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టదిట్టం చేసారు. పాకిస్థాన్ సరిహద్దులోని రాష్ట్రాలను హైఅలర్ట్ చేసి విమానాశ్రయాల్లో కీలక భద్రతాచర్యలు చేపట్టారు. 

India Pakistan : భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... గత రాత్రి ఇరుదేశాల మధ్య భయానక క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి.  భారత సైనిక స్థావరాలే టార్గెట్ గా దాడులకు దిగిన పాకిస్థాన్ ను సమర్ధవతంగా తిప్పికొట్టారు. ఈ దాడులను ముందుగానే పసిగట్టి భారత ప్రజలను అప్రమత్తం చేసారు... పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ పాటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోని జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం రాత్రి ఈ రాష్ట్రాల్లోని ప్రాంతాలనే పాకిస్థాన్ టార్గెట్ చేసింది.. కానీ పాక్ మిస్సైల్స్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్ధవంతంగా అడ్డుకుని గాల్లోనే పేల్చేసింది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశ రాజధాని డిల్లీలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాలు, ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు. పోలీసులు,  అత్యవసర విభాగాల అధికారుల సెలవులను రద్దు చేసారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి సమయంలో అయినా పనిచేసేలా ఆదేశించారు.  

పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో ముందుగానే మే 9న సెలవు ప్రకటించగా మిగతా రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ సెలవు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. 

గుజరాత్ తో పాటు ఇతర తీరప్రాంత రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసారు. సముద్రంలో గస్తీని మరింత పెంచింది ఇండియన్ నేవీ. సముద్రంలో ఎలాంటి అనుమానాస్పద కదలికలు జరిగినా వెంటనే సమాచారం అందించాలని నేవీ అధికారులు సూచించారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేసారు. హమీపుర్‌, ఉనా, బిలాస్‌పుర్‌లో భద్రత కట్టుదిట్టం చేసారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేసారు. అమృత్ సర్ స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర ప్రముఖ సందర్శనీయ ప్రదేశాల్లో పర్యాటకులకు ట్రావెల్ గైడ్ జారీచేసారు. అత్యవసర సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని...అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. 

ఇదిలాఉంటే భారత్, పాకిస్థాన్ వైమానిక దాడుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.  విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు జారీచేసింది విమానయాన శాఖ. అన్ని విమానాశ్రయాల్లోని  సెకండరీ లాడర్‌ పాయింట్‌లో ప్రయాణికుల తనిఖీలు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించారు.