Nalsar : హైదరాబాద్ లో ఈ గోలేంటి? దీంతో కాక్రోచ్ లకు సంబంధమేంటి?
నల్సార్ యూనివర్సిటీ వివాదం చిలికిచిలికి గాలివానలా మారి విద్యార్థుల భవిష్యత్ ను దెబ్బతీసే స్థాయికి చేరింది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? దీంతో కాక్రోచ్ లకు సంబంధమేంటి?

హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీపై దేశవ్యాప్త చర్చ
దేశంలోనే అత్యున్నత న్యాయ విద్యాసంస్థల్లో ఒకటి హైదరాబాద్లోని 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' (NALSAR University of Law). అయితే ఈ యూనివర్సిటీ ఇటీవల ఒక పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) విద్యార్థుల ఎన్రోల్మెంట్పై తాత్కాలిక నిషేధం విధించడం, తర్వాత ఆ నిర్ణయాన్ని బీసీఐ వెనక్కి తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఏమిటీ వివాదం? ఎందుకు రచ్చ అవుతోంది? అనేది తెలుసుకుందాం.
నల్సార్ యూనివర్సిటీ వివాదం ఏంటి?
నల్సార్ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని విశ్వవిద్యాలయ యంత్రాంగం నిర్ణయించింది. అయితే ఇటీవల దేశ రాజధాని డిల్లీలో జరిగిన నిరసనల ప్రభావం ఈ కార్యక్రమంపై పడింది. చీఫ్ జస్టిస్ ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ విద్యార్థులలో ఒక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలు, పోలీసుల అరాచకాలకు సంబంధించిన ఒక పిటిషన్ను సుప్రీంకోర్టులో విచారించే సమయంలో సీజేఐ చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలే ఈ అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా వీడియో ఆధారాలు సమర్పించగా "మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయకండి, వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు" అని ధర్మాసనం పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. న్యాయస్థానం బాధితుల ఆవేదనను ఆలకించకుండా ఇలా వ్యాఖ్యానించడం రాజ్యాంగ విలువలకు, ప్రాథమిక హక్కుల రక్షణకు విరుద్ధమని భావిస్తూ దాదాపు 450 మంది విద్యార్థులు ఒక వినతిపత్రాన్ని సిద్ధం చేసి, సీజేఐని స్నాతకోత్సవానికి ఆహ్వానించవద్దని కోరారు.
నల్సార్ వివాదంలోకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఈ నిరసన ప్రచారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చాలా తీవ్రంగా స్పందించింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాన్ని, సీజేఐ పదవిని గౌరవించని విద్యార్థులు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా లేదా చట్ట ఉపాధ్యాయులుగా రాణించలేరని బీసీఐ అభిప్రాయపడింది. ఇటువంటి ప్రవర్తన న్యాయవాద వృత్తి గౌరవానికి, క్రమశిక్షణకు నైతిక ప్రమాణాలకు భంగం కలిగిస్తుందని బీసీఐ పేర్కొంది.
ఈ క్రమంలో బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఒక సంచలన ఆదేశాన్ని జారీ చేశారు. 2026 సంవత్సరంలో నల్సార్ నుంచి పట్టా పొందిన విద్యార్థులెవరినీ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనూ న్యాయవాదిగా ఎన్రోల్ చేయకూడదని ఆదేశించారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు నిర్వహించారు అనే అంశంపై సమగ్ర విచారణ జరిపి 3 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని నల్సార్ వైస్ ఛాన్సలర్ను బీసీఐ ఆదేశించింది.
నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థులపైనే కాదు అధ్యాపకులపైనా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బయటి వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలకు పాల్పడుతున్నారని బీసీఐ అనుమానం వ్యక్తం చేసింది.
అయితే మొత్తం బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేస్తూ బీసీఐ తీసుకున్న తీవ్ర నిర్ణయంపై న్యాయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు చేసిన చర్యకు మొత్తం 2026 బ్యాచ్ను శిక్షించడం అన్యాయమని, ఇది వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని పలువురు సీనియర్ న్యాయవాదులు, చట్ట నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యతిరేకత, కౌన్సిల్ సభ్యుల అంతర్గత చర్చల అనంతరం ఎన్రోల్మెంట్ ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కౌన్సిల్ సభ్యులందరి ఆమోదంతో తన మునుపటి ఉత్తర్వులను సవరిస్తూ నూతన ప్రకటన విడుదల చేసింది.
"నల్సార్ 2026 బ్యాచ్లోని అత్యధిక శాతం విద్యార్థులు నిరపరాధులని, సీజేఐని అవమానించే ఉద్దేశం వారికి లేదని తేలింది. ఏ తప్పూ లేని విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. అందుకే ఎన్రోల్మెంట్ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నాం'' BCI స్పష్టం చేసింది. దీంతో 2026 నల్సార్ గ్రాడ్యుయేట్లు అందరూ తమకు నచ్చిన ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనైనా న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకోవడానికి పూర్తి అర్హత సాధించారు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, వారి కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది.
నల్సార్ వివాదంపై కొనసాగుతున్న విచారణ
న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై నిషేధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ నల్సార్ యూనివర్సిటీ వివాదానికి తెర పడలేదు. ఈ వివాదానికి కారణమైన ముఖ్య సూత్రధారులపై విచారణను బీసీఐ నిలిపివేయలేదు. నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవ రావు సమర్పించే వాస్తవ విచారణ రిపోర్ట్ కోసం బీసీఐ వేచి చూస్తోంది.
కేవలం వినతిపత్రంపై సంతకం చేసిన సాధారణ విద్యార్థులకు, ఈ నిరసన ప్రచారాన్ని ముందుండి నడిపి రెచ్చగొట్టిన వారికి వ్యత్యాసం ఉంటుందని బీసీఐ తెలిపింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులైన వారిపై మాత్రమే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
నల్సార్ స్నాతకోత్సవ వివాదం భారత న్యాయ విద్యారంగంలో గుర్తుండిపోయే సంఘటనగా మిగిలిపోనుంది. ఒకవైపు విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛ, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి ఎంత కీలకమో గుర్తుచేయగా... మరోవైపు అత్యున్నత న్యాయస్థాన గౌరవం, వృత్తిపరమైన క్రమశిక్షణల ప్రాముఖ్యతను ఇది చాటిచెప్పింది.

