భారతదేశ సముద్ర రక్షణలో ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరంలో అణు నౌకలు, యుద్ధ నౌకల కోసం కొత్త నౌకా స్థావరం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
స్థావరం ఎక్కడ ఉంది?
ఈ కొత్త స్థావరం విశాఖపట్నం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంబిల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉంది. ఇది ఈస్ట్రన్ నావల్ కమాండ్కు సమీపంగా ఉంటుంది.
ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారంటే.?
ఈ నౌకా స్థావరం ప్రాజెక్ట్ వర్షా కింద నిర్మిస్తున్నారు. ఇందులో భూగర్భ సురక్షిత గదులు, సొరంగాలు నిర్మించి అణు నౌకలు అక్కడే కనిపించకుండా నిల్వచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా బంగాళాఖాతంలో స్టెల్త్ ఆపరేషన్లు నిర్వహించవచ్చు.
రంబిల్లి ఎంత రహస్యంగా ఉంటుంది?
ఇది చైనా హైనాన్ దీవిలో ఉన్న అణు నౌకా స్థావరం మాదిరిగానే ఉంటుంది. ఇక్కడి లోతైన నీటిలో నౌకలు శత్రువు శాటిలైట్లకు కనిపించకుండా బయటకు రావచ్చు, లోపలికి వెళ్లవచ్చు. ఇది అణు బాంబులతో నడిచే SSBN నౌకల (Ballistic Missile Submarines) గోప్యత కోసం చాలా అవసరం.
పదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు దాదాపు 10 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. 2014 ఆగస్టులో ఈ స్థావరానికి సంబంధించి మొదటిసారిగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే భారత నౌకాదళంలో మూడో అణు నౌక INS అరిధమన్ 2025లో పనిచేయడానికి సిద్ధమవుతోంది.
ఇది 7,000 టన్నుల బరువు కలిగి, ఇప్పటికే ఉన్న INS అరిహంత్, INS అరిఘాట్ కన్నా పెద్దదిగా ఉండనుంది. ఇది 3,500 కి.మీ. పరిధి ఉన్న K-4 మిసైల్స్ ను మోసేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉంటుంది.
భవిష్యత్లో భారత్ ఇంకా ఆరు అణు యుద్ధ నౌకలు (SSNs), ఆధునిక SSBNలను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
పశ్చిమ తీరానికి కర్వార్ రక్షణ
పశ్చిమ తీర రక్షణ కోసం కర్ణాటకలోని కర్వార్ వద్ద ప్రాజెక్ట్ సీబర్డ్ కింద నౌకా స్థావరం అభివృద్ధి చెందుతోంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల ఈ స్థావరంలో కొత్త నిర్మాణాలను ప్రారంభించారు. దీని ద్వారా 32 నౌకలు, సబ్మేరిన్లు, 23 యార్డ్ క్రాఫ్ట్లు నిలిపే అవకాశం ఉంటుంది.
ప్రాజెక్ట్ సీబర్డ్ మొదటి దశ 2011లో పూర్తయింది. అప్పట్లో ఇది 10 నౌకలు నిలిపేలా రూపొందించారు. ఇప్పుడు ఇది అరేబియా సముద్రంలో భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుంది.