Lakhimpur Kheri violence Case : ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లఖింపూర్ ఖేరి హింస ఘటన కేసులో అలహాబాద్ హైకోర్టు మరో సారి అశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారని పేర్కొంది.
లఖింపూర్ ఖేరి హింస కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుల బెయిల్ ను సవాలు చేస్తూ రైతు కుటుంబీకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆశిష్ బెయిల్ ను రద్దు చేసింది.
నవ భారతంలో.. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోంది: ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా
అశిష్ మిశ్రా బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంతో కొన్నిషరతులతో బెయిల్ రావొచ్చని అందరూ భావించారు కానీ అది జరగలేదు. ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ..లఖింపూర్ కేసులో నలుగురు రైతులు చనిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘నిందితుడి కారు అక్కడ ఉంది, ఇది అతిపెద్ద వాస్తవం. ఈ కేసు క్రూరమైన నేరం కిందకు వస్తుంది.’’ అని పేర్కొంది. కాగా ఆశిష్ మిశ్రా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ చతుర్వేది, బాధితుల తరఫున కమల్జిత్ రఖ్దా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వినోద్ షాహి హాజరయ్యారు.
అంతకు ముందు ఈ అంశంపై జూలై 15 న విచారణ జరిగినప్పుడు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితే మంగళవారం ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను హైకోర్టు రద్దు చేసి మళ్లీ జైలుకు పంపింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుతానికి జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాదులు బెయిల్ పొందేందుకు శాయశక్తులా ప్రయత్నించినా కోర్టు అతని వాదనలు ఫలించలేదు.
Bengal SSC Scam : 20 కోట్లు కాదు..120 కోట్ల స్కామ్ జరిగింది.. పార్థ ఛటర్జీపై సంచలన దావా వేసిన ఈడీ
అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాదుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ న్యాయవాదులు మరోసారి కోర్టులో రివ్యూ అప్లికేషన్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021 అక్టోబర్ 3వ తేదీన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీలోని టికోనియాలో రైతుల బృందం నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన ఎస్ యూవీ రైతుల మీద నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ కారును అశిష్ మిశ్రానే డ్రైవ్ చేశారని, కావాలనే రైతులపై కారెక్కించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా కలకలం సృష్టించింది. పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. దీంతో లఖింపూర్ ఖేరి హింసాకాండను పర్యవేక్షించడానికి, దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్ ను నియమించింది. ఇదే కేసుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పునర్నిర్మించింది. కాగా.. మూడు వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం గతేడాది చివరిలో రద్దు చేసింది.