ఆడబిడ్డలను రక్షించడానికి ఎన్కౌంటర్లు అవసరం: బీజేపీ నేత సువేందు
ఆడబిడ్డలను రక్షించడానికి అవసరమైతే బెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లు కూడా చేపట్టాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. బెంగాల్ హంతకులకు కేరాఫ్ అడ్రస్గా మారిందని, ఈ పరిస్థితులను యోగి వంటి వ్యక్తులే అదుపులో ఉంచగలుగుతారని వివరించారు.
కోల్కతా: భారతీయ జనతా పార్టీ అధికారి సువేందు అధికారి బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళల రక్షణకు అవసరమైతే పోలీసులు ఎన్కౌంటర్లు కూడా చేపట్టాలి అని ఆయన అన్నారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వంటి వ్యక్తి అవసరం అని పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైనా ఆరోపణలు చేశారు. మహిళలు, పిల్లల భద్రతను కాపాడటంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ‘కాలేజీ చదువులు కూడా దాటని బాలికలు అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. పశ్చిమ బెంగాల్ హంతకులకు కేరాఫ్గా మారింది. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే యోగి ఆదిత్యానాథ్ వంటి వ్యక్తితోనే సాధ్యం’ అని సువేందు అధికారి తెలిపారు.
‘అవసరమైతే.. ఈ నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి నేరగాళ్లకు మనుషులతో కలిసి జీవించే హక్కే లేదు’ అని సువేందు వివరించారు.
సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తపస్ రాయ్ ఘాటుగా స్పందించారు. ‘మేం వేగంగా విచారణ, న్యాయం అందించాలని చూస్తున్నాం. అది చట్టం ద్వారానే అందిస్తాం. రేపిస్టులకు చట్టం ద్వారా కఠిన శిక్ష విధిస్తాం. సువేందు అధికారి చెబుతున్న ఎన్కౌంటర్లు అంటే ఏమిటీ? పశ్చిమ బెంగాల్ ప్రజలు వీటిని వ్యతిరేకిస్తారు. సువేందు అధికారికి బెంగాల్లో తాలిబాన్ పాలన కావాలని ఆశిస్తున్నాడా? ’ అంటూ టీఎంసీ లీడర్ తపస్ ఖండించారు.