మోడీ నాయకత్వంలో దేశం ఎటు వెళ్తుందో అర్థమవడం లేదు - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ఇటీవల వరుసగా ప్రధానిపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తాజాగా మళ్లీ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎటు వైపు ప్రయాణం సాగిస్తుందో తెలియడం లేదని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎటువైపు పయనిస్తోందో తనకు అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను ఖండించడానికి ప్రధాని ఎందుకు విముఖత చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు, మాజీ ప్రధానుల వారసత్వాన్ని మరచిపోవడంలో ప్రస్తుత ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం) ముందంజలో ఉందని అన్నారు. ‘‘మరే దేశంలోనూ ఇలా జరగదు. దేశం ఎటువైపు వెళ్తోందో నాకు తెలియడం లేదు’’ అని ఆయన అన్నారు. గత 70 ఏళ్లలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారని, కానీ ఖలిస్థాన్ ను ఉనికిలోకి రానివ్వలేదని అశోక్ గెహ్లాట్ తెలిపారు.
‘‘భారత్ వైరుధ్యాలకు వేదిక.. భిన్నమతాల కలయిక’’- రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
‘‘ ఈ రోజు అనేక చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను ప్రధాని ఖండించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ అలా చేయడంలో ఆయన ఎందుకు విముఖత చూపిస్తున్నారు? ’’అని రాజస్థాన్ సీఎం ప్రశ్నించారు. వచ్చే 25 ఏళ్ల పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని బీజేపీ నేతలకు మోదీ ఇచ్చిన సలహా ఆయన అహంకారాన్ని చాటి చెబుతోందని, రాబోయే కాలంలో ప్రజలు దానికి సమాధానం చెబుతారని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ‘‘ ప్రజాస్వామ్యంలో భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. రేపు ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఆయన అహంకారం సమయం వచ్చినప్పుడు ప్రజలు సమాధానం ఇస్తారు ’’ అని ఆయన మీడియాకు వివరించారు.
కాగా జైపూర్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్ల పాటు బీజేపీ తన లక్ష్యాలను నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దారి కోసం నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. అయితే దీనిపైన గెహ్లాట్ మాట్లాడుతూ... ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ తన చింతన్ శివార్ ను నిర్వహించిన తరువాత బీజేపీ జైపూర్ లో హడావిడిగా సమావేశాన్ని నిర్వహించిందని ఆయన విమర్శించారు.
ఇదిలా ఉండగా.. మూడు రోజుల కిందట కూడా రాజస్థాన్ సీఎం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మతంతో రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. అలాంటి రాజకీయాలు దేశానికి మంచిది కాదని ఉద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్ ఈ దేశానికి ప్రధాని అని ప్రధానిగా ఉన్నారని మోదీని ఉద్దేశించి ఆయన అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయని, అలాంటప్పుడు రెండు పార్టీలు ఎందుకు విలీనం కాకూడదని గెహ్లాట్ ప్రశ్నించారు.
రాజస్థాన్లో జరిగిన అల్లర్ల కేసులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరినప్పటికీ విచారణకు ఆదేశించలేదని గెహ్లాట్ ఆరోపించారు. ‘‘ భవిష్యత్తులో మతపరమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు అల్లర్ల కేసులపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం ఆయన (షా) ఎందుకు చూపడం లేదు ’’ అని గెహ్లాట్ అన్నారు. ఇటీవలి అల్లర్ల కేసుల్లో నిందితులందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వారే అని, ఇటలీకి చెందిన వారు కారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మత హింస ఘటనల వల్ల ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.