హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీలో ఎక్కువ మంది రెబల్స్ ఉన్నారు: మాజీ సీఎం ధుమాల్
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడ బీజేపీ టికెట్లు ఆశించి భంగపడ్డవారు చాలా మంది ఉన్నారని స్వయంగా బీజేపీ సీనియర్ లీడర్, మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ తెలిపారు. ఆయనకు కూడా ఈ సారి టికెట్ దక్కలేదు.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్కు కూడా ఈ సారి టికెట్ దక్కలేదు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ ధుమాల్ మాట్లాడుతూ, బీజేపీలో ఎక్కువ మంది రెబల్స్ ఉన్నారని బాంబ్ పేల్చారు.
‘పార్టీలో రెబల్స్ ఉన్నప్పుడు కచ్చితంగా నష్టమే జరుగుతుంది. వారితో ఒక్క ఓటు పోయినా అది పార్టీకి నష్టమే. పార్టీ కార్యకర్తలు దూరంగా వెళ్లినప్పుడు కచ్చితంగా చాలా ఓట్లు వెళ్లిపోతాయి’ అని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో 21 సీట్లల్లో ఈ అసంతృప్తి కనిపిస్తున్నదని తెలుపగా.. అవును. పార్టీలో రెబల్స్ ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. అంతేకాదు, రెండు పార్టీల్లోనూ రెబల్స్ ఉన్నారని పేర్కొన్నారు.
Also Read: హిమాచల్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. పోలింగ్ కు 4 రోజుల ముందు బీజేపీలో చేరిన 26 మంది కీలక నేతలు
అయితే, కాంగ్రెస్లో రెబల్స్ ఉన్నా.. అందులో తక్కువే ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్లో రెబల్స్ సంఖ్య సింగిల్ డిజిట్ వరకే ఉన్నదని, కానీ, బీజేపీలో ఎక్కువ మంది రెబల్స్ ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్న పార్టీలో భాగస్వామ్యం కావాలని, పార్టీ టికెట్ కావాలని ఎక్కువ మంది కోరుకోవడం సహజమేనని పేర్కొన్నారు. అందుకే బీజేపీలో ఎక్కువ మంది రెబల్స్ ఉన్నారని తెలిపారు.
తాను చాలా మంది రెబల్స్ను సంప్రదించానని వివరించారు. పార్టీని వీడిపోవడం కంటే కూడా పార్టీతో కలిసి ఉంటేనే వారికి ఎక్కువ మర్యాద ఉంటుందని తాను చెప్పినట్టు పేర్కొన్నారు. ఎందుకంటే.. తెగిన వెంట్రుక, ఊడిన పన్ను, సమాజం తిరస్కరించిన వ్యక్తి మళ్లీ ముందటి గౌరవాన్ని, హోదాను ఎట్టి పరిస్థితుల్లో పొందలేరని అన్నారు.
అయితే, ప్రతి రెబల్కు వారి వారి కారణాలు ఉన్నాయని, బహుశా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ఈ అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో ఆశావాహులను వదిలిపెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే అవకాశఆల నేపథ్యంలోనే ఈ అసంతృప్తి వెల్లడి అవుతున్నది.
Also Read: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు : మహిళలు, యువత, రైతులు టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టో.. వివరాలు ఇవిగో
గత ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థిగా పార్టీ చూసినప్పటికీ సుజన్పూర్లో ధుమాల్ ఓడిపోయారు. అందుకే ఈ సారి రంజిత్ సింగ్కు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తనకు టికెట్ దక్కకున్న పార్టీకి నిబ్ధుడినై ఉంటానని, కార్యకర్తగా పని చేస్తానని ఆయన లేఖ రాశారు. ఆయన పరువు దక్కించుకునేందుకే ఈ లేఖ అని విశ్లేషకులు చెబుతున్నారు.
తాను పార్టీకి విశ్వాసపాత్రుడినని, వచ్చే తరానికి దారి ఇవ్వడానికి తాను తప్పుకున్నానని ధుమాల్ తెలిపారు. కొత్త అభ్యర్థి రంజిత్ సింగ్ గెలుపు కోసం తాను పని చేస్తానని వివరించారు. ధుమాల్ కొడుకు అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.