హిమాచల్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. పోలింగ్ కు 4 రోజుల ముందు బీజేపీలో చేరిన 26 మంది కీలక నేతలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిలకు 4 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 26 మంది నాయకులు బీజేపీలో చేరారు.
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్ కు ఇంకా నాలుగు రోజుల సమయమే ఉందనుకుంటున్న తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ ఠాకూర్ ఖండ్తో పాటు పలువురు కీలక నాయకులు సోమవారం బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గానికి చెందిన మొత్త 26 మంది నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. వారిని ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి సుధాన్ సింగ్ లు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ కూడా పాల్గొన్నారు. పోలింగ్కు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఈ చేరికల సందర్భంగా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బీజేపీలో చేరిన వారందరికీ ఘనస్వాగతం పలికారు. బీజేపీ చారిత్రాత్మక విజయానికి అందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. కాగా.. అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారని అన్నారు.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్లో మీడియా ప్రతినిధులతో జేపీ నడ్డా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. క్షేత్రస్థాయిలో మంచి విధానాలను అమలు చేశారని అన్నారు. ‘‘ మేము సోలన్లో ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాని మోడీపై నమ్మకంతో ఉన్నారు. సీఎం జైరామ్ ఠాకూర్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మంచి విధానాలను అమలు చేశారు.’’ అని అన్నారు.
భారత్ జోడో యాత్రను ఎవ్వరూ ఆపలేరు.. అది శ్రీనగర్లోనే ముగుస్తుంది - రాహుల్ గాంధీ
కాగా.. 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబర్ 14వ తేదీన సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో షెడ్యూల్ విడుదల చేశారు. 17-25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 27న వాటని పరిశీలించారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీకి ఉన్న 68 స్థానాల్లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 43, కాంగ్రెస్ 22 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఈ సారి రెండు పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తోంది. ఢిల్లీ, పంజాబ్ తో పాటు హిమాచల్ ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం గతేడాది నుంచి కార్యచరణ అమలు చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆయన పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. కాగా.. జనవరి 8, 2023తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అయితే హిమాచల్ ప్రదేశ్లోనూ నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ రాష్ట్రంలో నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.