హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు : మహిళలు, యువత, రైతులు టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టో.. వివరాలు ఇవిగో
Himachal Assembly Elections: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2022 సన్నద్దలో భాగంగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించింది.
Himachal Pradesh Assembly Elections 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2022 కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. హామీలు, సంక్షేమ పథకాలు, అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ ఆయా పార్టీల నాయకులు ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 6) రాష్ట్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మహిళలు, యువత మరియు రైతులపై దృష్టి సారించినట్లే, బీజేపీ కూడా ఆయా వర్గాలకు సంబంధించి అనేక వాగ్దానాలు చేసింది. బీజేపీ తన మేనిఫెస్టోకు 'సంకల్ప్ పాత్ర' అని పేరు పెట్టింది.
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
- బీజేపీ తన మేనిఫెస్టోకు 'సంకల్ప్ పాత్ర' అని పేరు పెట్టింది. ఇది మహిళల కోసం 'స్త్రీ శక్తి సంకల్పం' అంటూ పేర్కొంది.
- బీపీఎల్ కుటుంబంలోని ఆడపిల్లలకు పెళ్లికి రూ.51 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది.
- పాఠశాల బాలికలకు సైకిల్, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికలకు స్కూటీలు ఇస్తామని పేర్కొంది.
- తల్లి, నవజాత శిశువుల సంరక్షణ కోసం మహిళలకు 25 వేల రూపాయలు అందిస్తామని తెలిపింది.
- దేవి అన్నపూర్ణ యోజన నుండి పేద మహిళలకు 3 ఉచిత LPG సిలిండర్లు అందిస్తామంది.
- పేద కుటుంబాలకు చెందిన 30 ఏళ్లు పైబడిన మహిళలను అటల్ పెన్షన్ యోజనలో చేర్చనున్నారు.
- 12వ తరగతిలో మొదటి 5 వేల ర్యాంకు పొందిన బాలికలకు నెలకు 2500 స్కాలర్షిప్ అందిస్తామని చెప్పింది.
- సరసమైన ధరల దుకాణాలు పశువుల దాణా సేకరణ, పంపిణీ కోసం సులభమైన వ్యవస్థను సృష్టిస్తాయని తెలిపింది.
- హిమ్కేర్ కార్డ్ కవర్ చేయని వ్యాధుల చికిత్స కోసం మహిళలకు స్త్రీ శక్తి కార్డ్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
- 12 జిల్లాలకు రెండు బాలికల హాస్టళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామంది.
యువత కోసం బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది?
హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు జేపీ నడ్డా తెలిపారు. దీంతో దశలవారీగా 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను బీజేపీ ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక రంగంలో కొనసాగుతున్న పనులు ఉంటాయి. హిమ్ స్టార్ట్ ఇప్పుడు యువత కోసం ఈ పథకాన్ని అమలు చేస్తానని జేపీ నడ్డా చెప్పారు. 9000 కోట్ల నిధి ఉంటుంది. స్టార్టప్లలో యువతకు మేలుజరుగుతుందని తెలిపారు.