కర్ణాటకలోని విద్యా సంస్థలో హిజాబ్ నిషేధం కొనసాగుతుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నగేష్ స్ఫష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన తుది తీర్పు ఇచ్చే వరకు కర్నాటక లో హిజాబ్ పై నిషేధం కొనసాగుతుందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ అత్యున్నత ధర్మాసనం పూర్తి స్థాయిలో తీర్పు ఇచ్చేదాక తమ ఆదేశాలకే కట్టుబడి ఉంటామని అన్నారు.
అప్పటి వరకు స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్లు ఉండవని మంత్రి అన్నారు. కర్నాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్పై నిషేధం విధించిన హైకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థులు తమ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా నిర్దేశించిన యూనిఫారంలోనే రావాలని ఆయన కోరారు.
త్వరలోనే కోర్టు నుంచి మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని నగేష్ అన్నారు. అయితే ఇప్పుడు అది ఉన్నత స్థాయికి చేరిందని అన్నారు. కర్ణాటక విద్యా చట్టం ప్రకారం విద్యాసంస్థల్లో మతపరమైన ఆచారాలు అనుమతించబడవని పేర్కొన్నారు. దీని ప్రకారం స్టూడెంట్లు హిజాబ్ లేకుండానే స్కూల్స్, కాలేజీలకు రావాలని మంత్రి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్ను విధించవద్దని డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. దాని కోసం మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి కర్ణాటకలో హిజాబ్ నిషేధం కొనసాగుతుందని అని అన్నారు. తరగతి గదిలో ఏ విద్యార్థిని హిజాబ్ ధరించకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
హిందీ తప్పనిసరిపై మండిపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు.. అక్టోబరు 15న డీఎంకే నిరసన
ఈ వివాదం గతేడాది డిసెంబర్ లో ఉడిపిలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో చెలరేగింది. పలువురు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడంతో హిందూ స్టూడెంట్లు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో తమకు తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కును కల్పించాలని కోరుతూ ముస్లిం బాలికలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసును పలు విడతల్లో కోర్టు విచారించింది. చివరికి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు మార్చి 16న కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేస్తూ తీర్పును వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఖచ్చితమైన మతపరమైన ఆచారం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని హైకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం పేర్కొంది. యూనిఫాంలు ధరించాలని, హిజాబ్ ధరించడాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు సమర్థించింది.
గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియాను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..
కాగా.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారు కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసు వారికి ఉపశమనం కలిగించలేదు. ఈఏడాది సెప్టెంబర్ 22న పిటిషన్లపై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, ధులియా ధర్మాసనం 10 రోజుల పాటు ఇరువర్గాల వాదలను ఈ ధర్మాసనం విన్నది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు గురువారం (నేడు) వెలువడింది. అయితే ఇందులో ఇరువురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. హిజాబ్ నిషేధంపై హైకోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేయగా, జస్టిస్ సుధాన్షు ధులియా వాటిని స్వాగతించారు. దీంతో ఈ కేసు ఇంకా కొలిక్కిరాలేదు.
