ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాల్ ఇటాలియన్ను ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారని ఆప్ వర్గాలు తెలిపాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచే పదజాలాన్ని ఉపయోగించిన వీడియోకు సంబంధించి ఈరోజు విచారణకు రావాలని జాతీయ మహిళా కమిషన్.. గోపాల్ ఇటాలియాకు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ మహిళా కమిషన్ కార్యాలయంలో నుంచి గోపాల్ ఇటాలియాను అదుపులోకి తీసుకున్ ఢిల్లీ పోలీసులు.. సరితా విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
గోపాల్ ఇటాలియన్ను ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారని ఆప్ వర్గాలు తెలిపాయి. గోపాల్ ఇటాలియాను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఢిల్లీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ‘‘మేము గోపాల్ ఇటాలియాపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఫిర్యాదు అందుకున్నాం. దాని గురించి ప్రశ్నించడానికి అతన్ని తీసుకువెళుతున్నాము’’ ఆ వర్గాలు పేర్కొన్నాయి.
గోపాల్ ఇటాలియాకు సంబంధించిన రెండు పాత వీడియోలు.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో ఒకదానిలో గోపాల్ ఇటాలియా.. ప్రధాని నరేంద్ర మోదీని అనుచిత పదజాలంతో విమర్శిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై కక్షపూరిత పదం వాడినట్టుగా కనిపిస్తుంది. ఇక, మహిళలకు ‘‘దేవాలయాలు, కథలు (మతపరమైన ఉపన్యాసాలు) దోపిడీకి మూలాలు’’ అని గోపాల్ చెప్పడం మరో వీడియోలో కనిపించింది. అక్కడ వారు ఏమీ పొందలేరని అన్నారు. తల్లులు, కుమార్తెలు.. అభివృద్ధి, గౌరవం కావాలంటే దేవాలయాలకు వెళ్లకుండా ఉండమని సలహా ఇవ్వడం వీడియోలో కనిపించింది.
ఈ క్రమంలోనే గోపాల్ ఇటాలియాకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత విచారణ కోసం అక్టోబర్ 13న కమిషన్ ముందు హాజరు కావాలని కోరింది. ఇందుకు నిరసనగా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ కార్యాలయం ముందు ఆప్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.
‘‘నన్ను జైల్లో పెడతానని ఎన్సీడబ్ల్యూ చీఫ్ బెదిరిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పటేల్ వర్గానికి జైలు తప్ప ఏం ఇవ్వగలదు.. బీజేపీ పటీదార్ సమాజాన్ని ద్వేషిస్తోంది.. నేను సర్దార్ పటేల్ వారసుడను.. మీ జైళ్లకు భయపడను.. నన్ను జైల్లో పెట్టండి’’ అని గోపాల్ ఇటాలియా ట్విట్టర్లో పేర్కొన్నారు.
