ముగ్గురి హత్యలతో విషాదాంతంగా ముగిసిన లాక్డౌన్ ప్రేమ కథ..
Golaghat murder case: కరోనా లాక్డౌన్ సమయంలో చిగురించిన ఓ ప్రేమ కథ షాదాంతంగా ముగిసింది. ఫేస్బుక్ ద్వారా స్నేహితులై.. మూడుళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. కానీ మూడు హత్యలతో ఈ కథ విషాదాంతమైంది. ఈ నేరాలకు పాల్పడిన నిందితుడు నేరుగా పోలీసుల ముందు లొంగిపోయాడు.

Lockdown Love Story: కరోనా లాక్డౌన్ సమయంలో చిగురించిన ఓ ప్రేమ కథ షాదాంతంగా ముగిసింది. ఫేస్బుక్ ద్వారా స్నేహితులై.. మూడుళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. కానీ మూడు హత్యలతో ఈ కథ విషాదాంతమైంది. ఈ నేరాలకు పాల్పడిన నిందితుడు నేరుగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ హత్యా ఘటన అసోంలో చోటుచేసుకుంది.
ఈ హత్యల గురించి పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అసోంలోని గోలాఘాట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య కేసులో అసోం పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నజీబుర్ రెహ్మాన్ బోరా (25) అనే వ్యక్తి తన భార్య సంఘమిత్ర ఘోష్ (24), ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ లను గోలాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలాఘాట్ పట్టణంలోని హిందీ స్కూల్ రోడ్ నివాసంలో సోమవారం మధ్యాహ్నం హత్య చేశాడు. అనంతరం నిందితుడు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయే సమయంలో అతని తొమ్మిదో నెల బిడ్డ అతనితో ఉంది. ఐపీసీ సెక్షన్ 302/448 కింద కేసు (నంబర్ 200/2023 ) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌహతికి చెందిన ఫోరెన్సిక్ స్టేట్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), సీఐడీ బృందాలు గోలాఘాట్ కు చేరుకున్నాయని అసోం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మంగళవారం తెలిపారు.
ట్రిపుల్ మర్డర్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను డీజీపీ వివరిస్తూ.. నిందితుడు నజీబుర్ రెహ్మాన్ బోరా, సంఘమిత్ర 2020 జూన్ కరోనా లాక్ డౌన్ సమయంలో ఫేస్ బుక్ లో కలుసుకుని స్నేహితులయ్యారు. కొన్నిరోజుల్లోనే ఇది ప్రేమగా మారింది. ఆ సమయంలో నిందితుడు గోలాఘాట్ లో ఉన్నాడు. అక్టోబర్ 2020లో, వారిద్దరూ కోల్కతాకు పారిపోయారు. దీని తర్వాత సంఘమిత్ర తల్లిదండ్రులు సెక్షన్ 366 IPC కింద గోలాఘాట్ PS కేసు నంబర్ 680/2020 ద్వారా FIR నమోదు చేశారు. తదనంతరం, సంఘమిత్రను గోలాఘాట్ పోలీసులు కోల్కతా నుంచి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, అప్పటికే వారు కోల్కతాలో వివాహం చేసుకున్నారని చెప్పారు. అదే ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, బెయిల్ రావడంతో మళ్లీ తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.
ఇదే క్రమంలో 2022 జనవరిలో, నిందితుడు, సంఘమిత్ర మరోసారి చెన్నైకి పారిపోయి ఐదు నెలలు అక్కడే ఉన్నారు. అక్కడ సంఘమిత్ర గర్భవతి అయింది. వారు 2022 ఆగస్టులో గోలాఘాట్కు తిరిగి వచ్చి నిందితుడి ఇంట్లో కలిసి నివాసం ప్రారంభించారు. నవంబర్ లో వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే, నిందితుడు నజీబుర్ రెహ్మాన్ బోరా.. తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ సంఘమిత్ర ఘోష్ తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. దీనికి సంబంధించి, మార్చి 21, 2023న గోలాఘాట్ పీఎస్లో ఐపీసీ సెక్షన్ 443/325/307/506 కింద గోలాఘాట్ పీఎస్ కేసు నంబర్ 119/2023 ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు అరెస్టయి 28 రోజుల పాటు జైలులో ఉన్నాడు. బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, నిందితుడు తన భార్య, బిడ్డను కలిసే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఏప్రిల్ 29 (2023) సంఘమిత్ర సోదరుడు తమ కుటుంబ సభ్యులపై నిందితుడు దాడిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 24న వారి వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితుడు నజీబుర్.. తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు.