ఇండియాలో సమస్యలను పరిష్కరించడానికి దేవుడే ఆప్ను ఎంచుకున్నాడు: అరవింద్ కేజ్రీవాల్
ఇండియాలో సమస్యలను పరిష్కరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీని దేవుడే ఎంచుకున్నాడని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పేదలను సంపన్నులు చేయడమే తమ పార్టీ లక్ష్యం అని వివరించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ గుర్తింపు పొందిన తర్వాత తాజాగా ఆప్ 11వ జాతీయ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు సంధించారు. దేశాన్ని ఏజెన్సీల ద్వారా ముక్కలు చేయాలనుకుంటున్న పార్టీ ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించే అవకాశమే లేదని అన్నారు. వారు దేశాన్ని మల్లీ 19వ శతాబ్దానికి తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
దేశంలోని సమస్యలను పరిష్కరించడానికి దేవుడే ఆప్ను ఎంచుకున్నాడని ఆయన అన్నారు. దేశంలో పేదలను సంపన్నులు చేయడానికి దేవుడే ఈ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు.
ఈ సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఫోకస్ పాయింట్లు, విజన్ పై చర్చించారు. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ సృష్టించిన ఉపాధి గురించి మాట్లాడారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ఉద్దేశాలు సరిగ్గా ఉంటే పరిష్కరించవచ్చని చెప్పారు.
Also Read: ఆకస్మికంగా గుండెపోటుతో సంభవించే మరణాలకు లాంగ్ కోవిడ్తో సంబంధం.. వైద్యుల సూచన ఇదే
ప్రతి మతం, కులం ప్రజలు ఒకరిపట్ల మరొకరు ప్రేమ, ఆప్యాయతలతో మెలిగే దేశం కోసం తాము శ్రమిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కుల ఆధారిత హింస లేని దేశాన్ని కాంక్షిస్తున్నామని వివరించారు. ప్రజలు సమైక్యంగా కలిసి పని చేయాలని కోరారు. అలా చేయకుంటే దేశం ఎట్టిపరిస్థితుల్లో అభివృద్ధి చెందబోదని అన్నారు. 130 కోట్ల మంది ప్రజలు అంతా ఒకే కుటుంబం అని చెప్పారు.