రేపు భారత్ పర్యటించనున్న ఫ్రాన్స్ రక్షణ మంత్రి.. ప్రధాని మోడీతో భేటీ
ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ రేపు భారత్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. అలాగే, ఉభయ దేశాల వార్షిక రక్షణ సదస్సు కోసం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. అలాగే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ సమావేశం అవుతారు. ఈ మేరకు ఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రక్షణ మంత్రి(French Defence Minister) ఫ్లోరెన్స్ పార్లీ రేపు భారత్(India)కు అధికారిక పర్యటన చేయనున్నారు. ఇండో- ఫ్రెంచ్ వ్యూహాత్మక సంబంధాలు, రక్షణ ఒప్పందాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆమె పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో సమావేశం కానున్నారు. అలాగే, వార్షిక రక్షణ సంబంధ చర్చల కోసం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ చర్చల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య గల విస్తృత రక్షణ సహకారం, నిర్వహణపరమైన సహకారం విషయాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో సముద్ర జలాలు, రక్షణ విషయాలపైనా మాట్లాడనున్నారు. మేక్ ఇన్ ఇండియా ఇనీషియేటివ్కు అనుగుణంగా పారిశ్రామిక, సాంకేతికత భాగస్వామ్యంపైనా చర్చలు జరుగనున్నట్టు ఫ్రెంచ్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ అధికారిక పర్యటనలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్టీ.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ సమావేశం కాబోతున్నారు. అలాగే, నేషనల్ వార్ మెమోరియాల్ దగ్గర అమరులైన భారత జవాన్లకు ఆమె నివాళులు అర్పిస్తారు. హెలికాప్టర్ క్రాష్ దుర్ఘటనలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్కు ఆమె నివాళులు అర్పించనున్నారు.
Also Read: జీ20 సదస్సు: ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ చిట్చాట్..
ముఖ్యంగా ఈ పర్యటనలో ఇండో పసిఫిక్లో ఫ్రాన్స్ ప్రాముఖ్యత, ఆ దేశ వ్యూహాల్లో భారత్కు ఉన్నత స్థానం ఇచ్చే విషయాలను హైలైట్ చేయనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్, భారత్ భద్రతా బలగాలు పలు ఎయిర్, నేవీ, ఆర్మీ ఎక్సర్సైజులు చేసిన నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత్ పర్యటిస్తున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో సహకారంపై ఇటీవలే ఐరోపా సమాఖ్య ఏర్పరుచుకున్న వ్యూహాన్ని ఈ పర్యటనలో ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ వెల్లడించనున్నారు. ఇది ఇండో పసిఫిక్ రీజియన్కు ఎంతో ప్రయోజనకరమైనట్టుగా ఈయూ భావిస్తున్నది. 2022 జనవరి 1న యురోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షతను ఫ్రాన్స్ చేపట్టనుంది. అప్పుడు ఇండో పసిఫిక్, భారత్ను ప్రధాన అంశాలుగా పరిగణించనుంది.
ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ చివరి సారిగా 2020 సెప్టెంబర్ 10న భారత్ పర్యటించారు. ఐదు రాఫేల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళంలో చేర్చే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తాజా ప్యటనలో ఆమె భారత డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్ వెల్లడించనుంది. మేక్ ఇన్ ఇండియా ఆలోచనల్లోనే భారత్కు ఉన్నత సాంకేతికతను అందించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాలను పేర్కొననుంది.
Also Read: ఫ్రెంచ్ సెనేట్లో మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్.. తెలంగాణ ప్రగతి విధానాలు వివరించిన మంత్రి
చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా ఇన్నాళ్లు భారత్తో అనుయాయంగా కొనసాగింది. కానీ, తాజగా, ఆకస్ కూటమితో ఆస్ట్రేలియా వైపు చూపుసారించినట్టు అర్థమవుతున్నది. అదీగాక, ఆస్ట్రేలియాకు అణుజలాంతర్గామిని ఆఫర్ చేసింది. దాని ఫలితంగా ఫ్రాన్స్తో చేసుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా అర్ధంతరంగా రద్దు చేసుకుంది. కనీసం మిత్రపక్షమని చూడకుండా ఫ్రాన్స్ ఒప్పందం రద్దు అయ్యేట్టు అమెరికా వ్యవహరించిందని ఫ్రాన్స్ రుసరుస లాడుతున్నది. ఈ నేపథ్యంలోనే భారత్కు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు. తాాజాగా, ఆ దేశ రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు.