భారత మాజీ క్రికెటర్ , పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్షకు గురయ్యారు. ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించింది. 

భారత మాజీ క్రికెటర్ , పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్షకు గురయ్యారు. ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించింది. 

1988 డిసెంబర్ 27న సిద్ధూ ఒక వాగ్వాదం సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే సిద్ధూపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద హత్యానేరం కాకుండా నేరపూరిత నరహత్య విధించాలన్న అభ్యర్ధనను న్యాయమూర్తులు జస్టిస్ ఏం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. 

2018లో ఈ నేరానికి గాను సిద్ధూను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే దోషపూరిత నరహత్య ఆరోపణలకు సంబంధించిన కేసులో మాత్రం సిద్ధూను నిర్దోషిగా ప్రకటించింది. అలాగే వెయ్యి జరిమానా విధించింది. ఇదే కేసులో సిద్ధూ సహచరుడు రూపిందర్ సింగ్ సంధును కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 

అనంతరం ఈ కేసు సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. పాటియాలాలోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 1999 సెప్టెంబర్ 22న ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిద్ధూ, అతని సహచరులను నిర్దోషులుగా ప్రకటించారు. దీనిపై బాధిత కుటుంబాలు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశాయి. 2006లో సిద్ధూను దోషిగా నిర్ధారిస్తూ ధర్మాసనం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఏడాది జైలు శిక్షను విధిస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.