వాజ్పేయ్ లవ్స్టోరీ: ఆ లవ్లెటర్ అందితే...
తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోకపోయినా ఆమె ఎక్కడ ఉన్నా ఆమె సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకొంటూ ఓ సినీ కవి రాసిన పాటను నిజమైన ప్రేమికులు ఎప్పుడూ కూడ గుర్తు చేసుకొంటారు
న్యూఢిల్లీ: తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోకపోయినా ఆమె ఎక్కడ ఉన్నా ఆమె సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకొంటూ ఓ సినీ కవి రాసిన పాటను నిజమైన ప్రేమికులు ఎప్పుడూ కూడ గుర్తు చేసుకొంటారు. నీ సుఖమే నే కోరుకొన్నా.... నీను విడిచి నే వెళ్తున్నా అంటూ ఓ సినిమాలో కథానాయకుడు తన ప్రేయసిని వీడి వెళ్లే సమయంలో రాసిన పాట మాజీ ప్రధాని వాజ్పేయ్కు వర్తిస్తోంది.
కాలేజీల్లో చదువుకొనే రోజుల్లో తన క్లాస్మేట్ను ప్రేమించాడు వాజ్పేయ్. తన ప్రియురాలికి వాజ్పేయ్ తన ప్రేమను కూడ వ్యక్తం చేశాడు.అయితే వాజ్పేయ్ ప్రేమ మాత్రం విజయవంతం కాలేదు. వాజ్పేయ్ ప్రేమించిన అమ్మాయి తన అభిప్రాయాన్ని చెప్పేందుకు చేసిన ఆలస్యం వీరిద్దరూ వివాహం జరగకుండా ఆగిపోయిందని చెబుతారు.
1942 లో గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో వాజ్పేయ్ చదువుకొనేవాడు. ఆ సమయంలో రాజ్కుమారి అనే క్లాస్మేట్తో వాజ్పేయ్ కు పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ వీరిద్దరూ కూడ లైబ్రరీలో కలుసుకొనేవారు. కళ్లతోనే వారిద్దరూ కూడ మాట్లాడుకొనేవారు. రాజ్కుమారిని వివాహం చేసుకోవాలని వాజ్పేయ్ నిర్ణయించుకొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ఓ లేఖలో వ్యక్తం చేశారు. తన ప్రేయసికి లవ్ లెటర్ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు అందేలా చేశారు. అయితే రాజ్కుమారి స్పందన కోసం వాజ్పేయ్ ఎదురుచూశాడు. రెండు మూడు రోజులు దాటినా కానీ ఆమె నుండి స్పందన రాలేదు.
అయితే వాజ్పేయ్పై పట్ల తనకు ప్రేమ ఉన్న విషయాన్ని రాజ్కుమారి కూడ ఓ లేఖలో రాసి పుస్తకంలో పెట్టింది. అయితే ఆ పుస్తకాన్ని వాజ్పేయ్కు ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, వీలు చిక్కలేదు. మూడు రోజుల తర్వాత వ్యక్తిగత పనుల కోసం వాజ్పేయ్ ఢిల్లీకి వెళ్లాడు. ఆయన ఆలస్యంగా గ్వాలియర్ కు వచ్చాడు.
అయితే తన ప్రేమ విషయాన్ని రాజ్కుమారి ఇంట్లో చెప్పింది. అయితే రాజ్కుమారి కుటుంబసభ్యులు వాజ్పేయ్తో పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరివీ బ్రాహ్మణ కుటుంబాలే అయినప్పటికీ తమది శాఖ పరంగా, గోత్రంపరంగా ఉన్నతమైన కుటుంబమని రాజ్కుమారి తల్లిదండ్రుల భావన! అందుకే ఆమె ప్రేమను మొగ్గగానే తుంచేసి బ్రజ్ నారాయణ్ కౌల్ అనే కాలేజీ లెక్చరర్కిచ్చి 1947 లో ఢిల్లీలో పెళ్లి చేసేశారు.
పెళ్లైన తర్వాత గ్వాలియర్ తీసుకొచ్చారని రాజ్కుమారి మేనకోడలు కామినీ కౌల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ విషయమై వాజ్పేయ్ ఎప్పుడూ కూడ నోరు విప్పలేదు. కామినీ కౌల్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ విషయం కొద్దిమందికైనా తెలిసింది.
తాను కోరుకొన్న యువతితో వివాహం జరగకపోవడంతో వాజ్పేయ్ పూర్తిగా రాజకీయాల్లో తలమునకలయ్యారు. రాజకీయాల్లో ఉన్న కాలంలోనే ఢిల్లీలో రాజ్కుమారిని కలిశారు. ఆమె భర్త బ్రజ్ నారాయణ్ కౌల్ ఢిల్లీ యూనివర్శిటీలో రామజా కాలేజీలో తత్వశాస్త్ర అధ్యపకుడిగా పనిచేసేవాడు. వాజ్పేయ్కు బ్రజ్ నారాయణ్ కౌల్ కు కూడ స్నేహం ఏర్పడింది. తరచూ వాళ్లింటికి వాజ్పేయ్ వెళ్లేవాడు.
ప్రోఫెసర్ కౌల్- రాజ్ కుమారి దంపతులకు నమిత, నమ్రత అనే ఇద్దరు పిల్లలు. కొంతకాలానికి ప్రోఫెసర్ కౌల్ మరణించారు. దీంతో రాజ్కుమారి కుమార్తె నమితను వాజ్పేయ్ దత్తత తీసుకొన్నారు. నమిత కూతురు నీహారిక అంటే వాజ్పేయ్కు చాలా ప్రేమ. 2014లో రాజ్కుమారి మృతి చెందారు.
ఈ వార్తలు చదవండి
నాతో వాజ్పేయ్ వివాదమిదీ: గోవిందాచార్య
ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్పేయ్ సర్కార్
పార్లమెంట్పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్పేయ్, అద్వానీ
రాజీవ్ గాంధీ వల్లే.. వాజ్ పేయీ ఇంతకాలం...