రాజీవ్ గాంధీ వల్లే.. వాజ్ పేయీ ఇంతకాలం...
ఆయన తిరిగి రాని అనంత లోకాలకు వెళ్లిపోయిన సందర్భంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని మెమరీస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన తిరిగి రాని అనంత లోకాలకు వెళ్లిపోయిన సందర్భంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని మెమరీస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
తాను రాజీవ్ గాంధీ కారణంగానే ఇంతకాలం బతికానని ఒకానొక సందర్భంలో స్వయంగా వాజ్ పేయీనే చెప్పారు. ఆయన అలా ఎందుకు అన్నారంటే...1988లో విపక్ష నేతగా ఉన్న వాజ్పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు. విదేశాల్లో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయం అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్గాంధీకి తెలిసింది. ఆయన వాజ్పేయిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ‘ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారత్ నుంచి వెళ్లే బృందంలో మిమ్మల్ని కూడా చేర్చుతున్నాను. అదేసమయంలో మీరు న్యూయార్క్లో వైద్యం కూడా చేయించుకోవచ్చు’ అని తెలిపారు. ఈ విషయాన్ని వాజ్పేయి సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్తో పంచుకున్నారు. ‘రాజీవ్ వల్లే నేను బతికున్నాను’ అని తెలిపారు.