భారత విదేశాంగ విధానం భేష్.. అమెరికాకు కూడా తలొగ్గడం లేదు - పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ ను ప్రశంసించారు. అమెరికా ఒత్తిడిని భారత్ తనపై పడకుండా చూసుకుంటోందని అన్నారు. ప్రజలపై ఒత్తిడి పడకుండా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని తెలిపారు.
పాక్ మాజీ ప్రధాని భారత్ పై మరో సారి ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికా ఒత్తిడిని సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి సబ్సిడీ చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు. స్వతంత్ర విదేశాంగ విధానం సాయంతో తమ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో తలలేని కోడిపుంజులా తిరుగుతోందని విమర్శించారు.
ప్రజలే మాకు మొదటి ప్రాధాన్యత.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోడీ
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ‘‘క్వాడ్ లో భాగం అయినప్పటికీ భారతదేశం అమెరికా నుండి ఒత్తిడికి దూరంగా ఉంది. ప్రజలను కూడా దూరంగా ఉంచింది. భారత ప్రజలకు ఉపశమనం కలిగించడానికి డిస్కౌంట్ రష్యన్ చమురును కొనుగోలు చేసింది. స్వతంత్ర విదేశాంగ విధానం సహాయంతో మా ప్రభుత్వం దీనిని సాధించడానికి కృషి చేస్తోంది ’’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భారత్ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించిన సమాచారాన్ని ఈ ట్వీట్ తో ఆయన షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ పలువురు నేతలపై మండి పడ్డారు. చాలా మంది మీర్ జాఫర్, మీర్ సాదిక్ లు అధికార మార్పు కోసం బాహ్య ఒత్తిడికి లొంగిపోయారని, ఇది పాకిస్తాన్లో అధికార మార్పుకు దారితీసిందని ఆయన ఆరోపించారు. తనను అధికారంలో నుంచి దించడానికి పలువురు నేతలు విదేశీ శక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ‘‘ 'మా ప్రభుత్వానికి పాకిస్థాన్ ఆసక్తి అత్యంత ప్రధానమైనది. కానీ దురదృష్టవశాత్తు స్థానిక మీర్ జాఫర్, మీర్ సాదిక్ అధికార మార్పు కోసం బాహ్య ఒత్తిడికి లొంగిపోయారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితిలో ఉంది ’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా ఉక్రెయిన్పై రష్యాపై దాడి చేయడం ప్రారంభించిన నాటి నుంచి పాశ్చాత్య దేశాలు మాస్కోపై తీవ్ర ఆంక్షలు విధించాయి. దీంతో అనేక దేశాలు రష్యాతో వ్యాపార లావాదేవీలు నిలిపివేశారు. చాలా దేశాలు రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం మానేశాయి. ఈ పరిణామాన్ని భారత్ చాకచక్యంగా ఉపయోగించుకుంటోంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులను పెంచుకుంది. ఓ నివేదిక ప్రకారం ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు రష్యా నుంచి సబ్సిడీ చమురు కొనుగోలును భారత్ తీవ్రతరం చేసింది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ దీనిని కొనసాగిస్తోంది.
Amit Shah: నూతన విద్యా విధానంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశంలో పెట్రోల్ పై లీటర్ కు రూ. 9.5, అలాగే డీజిల్ పై లీటరు రూ.7 తగ్గింది. ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలే మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అనేక మంది బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే కాంగ్రెస్ మాత్రం విమర్శించింది. గత మూడు నెలలుగా పెట్రోల్ పై లీటర్ రూ.10 పెంచి, ఇప్పుడు రూ.9 తగ్గించడం న్యాయం కాదని తెలిపింది.