Home Minister Amit Shah: అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు సాధారణ 'నమస్తే' అనే పదానికి బదులుగా 'జై హింద్' అనే పదాలతో ప్రజలను పలకరించినప్పుడు కనిపించే నిజమైన దేశభక్తి భావాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రత్యేకత దేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  

New Education Policy: దేశంలోని యువత 'జీవితంలో అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా నిలిచేంత సమర్థులు'గా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా మానవ విలువలు, విద్య, శాస్త్రీయ దృక్పథం, కృత్రిమ మేధస్సు ఆధారంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్‌ఈపీని ప్రవేశపెట్టారని అన్నారు. ఈశాన్య భార‌త రాష్ట్రమైన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తిరప్ జిల్లాలోని నరోత్తం నగర్‌లోని రామకృష్ణ మిషన్ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో హోంమంత్రి ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నూతన విద్యా విధానం-2020లో 125 ఏళ్ల క్రితం రామకృష్ణ మిషన్‌ స్థాపకుడు, తత్వవేత్త, శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద పరిశీలనలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్యపై స్వామి వివేకానంద దార్శనికతను ఉటంకిస్తూ, ప్రజలను మేధావులుగా తీర్చిదిద్దేందుకు, ప్రజలలోని అంతర్గత శక్తిని వెలికితీసేందుకు, దిశానిర్దేశం చేసేందుకు నూత‌న విద్యా విధానం తోడ్ప‌డుతుంద‌ని తెలిపారు. "జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య ఒక వ్యక్తిని సిద్ధం చేయలేకపోతే, అది వ్యర్థం. విద్య మనిషి లక్షణాన్ని మలచలేకపోతే, అది పనికిరానిదిగానే ఉంటుంది" అని అమిత్ షా అన్నారు. 21వ శతాబ్దాన్ని విజ్ఞాన శతాబ్దంగా అభివర్ణించిన షా, దేశంలోని యువతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో సమానంగా నిలబడేంత సమర్థులను తయారు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

"విదేశాల యువతతో పోటీ పడగల భార‌త‌ యువతను సృష్టించడం NEP లక్ష్యం" అని అమిత్ షా అన్నారు. అలాగే, రామ‌కృష్‌ణ మిష‌న్ సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడారు. "దాని ఆస్ప‌త్రులలో రోగులకు చికిత్స చేయడం.. వారి కేంద్రాల్లో నాణ్యమైన విద్యను అందించడంతో ఆదర్శప్రాయమైన నిబద్ధతను ప్రదర్శించింది. రామ‌కృష్ణ మిష‌న్ సేవ‌ల‌కు యావ‌త్‌ దేశం అభివాదం చేస్తోంది" అని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజల విద్యా రంగం, సామాజిక-సాంస్కృతిక జీవితాలలో RKM సహకారాన్ని కూడా ఆయన ప్రశంసించారు. "అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు సాధారణ 'నమస్తే' అనే పదానికి బదులుగా 'జై హింద్' అనే పదాలతో ప్రజలను పలకరించినప్పుడు కనిపించే నిజమైన దేశభక్తి భావాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రత్యేకత దేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించదు. ఈ ఘనత వీరికే చెందుతుంది. రాష్ట్ర ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందు రామకృష్ణ మిషన్ కృషి గొప్ప‌ది’ అని అన్నారు.

ఆలయాన్ని నిర్మించడం గొప్ప పని కానీ, పాఠశాలను స్థాపించి ప్రజలకు విజ్ఞానాన్ని అందించడం మరింత విలువైనదని అమిత్ షా అన్నారు. "రాష్ట్రంలో RKM ద్వారా యాభై సంవత్సరాల శ్రేష్టమైన సేవ గుర్తించదగినది. ఈ క్ర‌మంలో స‌మ‌స్య‌లు, అనేక క‌ష్టాలు ఉన్నప్పటికీ మానవాళికి అంకితమైన సేవ కోసం అంకిత‌మైన ఈ సంస్థలోని ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా నమస్కరిస్తున్నాను" అని అమిత్ షా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ దశాబ్దాలుగా సమస్యలను ఎదుర్కొంటోందని, సవాళ్లను క్రమంగా అధిగమిస్తోందని చెప్పారు. "కానీ రాష్ట్రం సమస్యల బారిన పడకుండా చూడలేదు ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి RKM రాష్ట్రానికి తన సేవలను అందిస్తోంది. RKM చేరిన ప్రదేశాలలో, స్థానిక సంస్కృతి మరియు వారసత్వం, మాండలికాలు మరియు మతాన్ని పరిరక్షించడంలో గణనీయమైన కృషి చేసింద‌ని" అన్నారు. "అరుణాచల్ ప్రదేశ్ నేడు దాని గొప్ప సంస్కృతి మరియు సంప్రదాయాలతో పాటు ఆధునిక ప‌రిస్థితుల‌తో గర్వంగా ముందుకు సాగుతోంది.. ఇది RKM నిరాడంబరమైన మద్దతు వల్ల మాత్రమే సాధ్యమైంది" అని అమిత్ షా అన్నారు.