హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు.. 19 మంది మృతి.. పలువురు గల్లంతు
హిమాచల్ ప్రదేశ్ లో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావడంతో దాదాపు 19 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. మండి, కాంగ్రా, చంబా, సిమ్లా జిల్లాల్లో వచ్చిన ఆకస్మిక వరద వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 19 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనల వల్ల మండి, కాంగ్రా, చంబా జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది.
గుజరాత్ లో సెల్ ఫోన్ గొడవ... కొడుకుపై కన్నతండ్రి కాల్పులు
భారీ వర్షాల వల్ల అనేక నదులు, కాలువలు ఉప్పొంగి ఇళ్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం, మేఘాల విస్ఫోటనాలకు దారితీశాయని ప్రభుత్వం పేర్కొంది. మండి జిల్లాలో ఎనిమిది కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్ బ్లస్ట్ వల్ల దాదాపు 10 మంది చనిపోయారు. కాంగ్రా జిల్లాలో దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
742 రోడ్లు మూసివేతకు గురయ్యాయి. వాటిలో 407 పునరుద్దరించారు. ఆదివారం నాటికి 268 క్లియర్ అవుతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 2,000 ట్రాన్స్ఫార్మర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలను మూసివేయాలని, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో నిర్వాసితులైన వారికి ఆశ్రయం కల్పించాలని అధికారులకు చీఫ్ సెక్రటరీ సూచించారు. వర్షం వల్ల ఏర్పడిన నష్టాన్ని వీడియోల్లో చిత్రీకరించాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక మంది మండి జిల్లా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఇక్కడ అనేక మంది సమాధి అయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రాష్ట్ర రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ దాదాపు 32 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో 14 ఇళ్లు డేంజర్ జోన్ లో ఉండటంతో అందులో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గుజరాత్ మంత్రి వర్గంలో మార్పులు.. ఇద్దరు మంత్రుల నుంచి శాఖల తొలగింపు..
కందపటాన్లోని శివుడి ఆలయం, సత్సంగ్ భవన్, ధరంపూర్లోని హెచ్ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగాయి. నాగోర్టా బగ్వాన్లోని రాజీవ్ గాంధీ ఇంజినీరింగ్ కళాశాల పాక్షికంగా నీట మునిగింది. ఒక్కసారిగా వరద నీరు భవనంలోకి చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ఉధృతంగా ప్రవహించడంతో కాంగ్రాలో చాలా రహదారులు మూసుకుపోయాయి.
శుక్రవారం నుంచి కటౌలా వద్ద మండి-కులు రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. చండీగఢ్-మనాలి హైవే కూడా బ్లాక్ అయ్యింది. సున్నీలోని మజ్హివార్, మంజు మీదుగా ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఆనంద్పూర్ సమీపంలో కొండచరియలు విరిగిపడి సిమ్లాలోని షోఘి-మెహ్లీ బైపాస్పై పడ్డాయి.