ఢిల్లీ-యూపీ బార్డర్ లో రైతుల సంబరాలు..
నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని నిరసన తెలిపిన రైతులందరూ నేడు ఇంటికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా యూపీ, ఢిల్లీ బార్డర్లలో మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన నేటితో ముగిసింది. బుధవారం రోజు కౌశాంబి ప్రాంతంలో రైతులంతా అక్కడ సంబరాలు నిర్వహించుకొని ఇళ్లకు బయలుదేరారు. సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాకేష్ తికాయత్ ఆధ్వర్యంలో రైతులంతా ఆనందంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ తికాయత్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మాతో ఉన్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. లంగర్లను నడిపిన ప్రజలకు, మా కోసం నిత్యావసరాలు తెచ్చిన గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు. 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. మా ఉద్యమం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం.పూర్తిగా ఉపసంహరించుకోలేదు.’’ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన తరువాత మళ్లీ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ నిరసనల సందర్భంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులపై మోపబడిన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్రం తెలిపింది. అలాగే పోరాటం సమయంలో చనిపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ఆ రెండు ప్రభుత్వాలు సమ్మతించాయని చెప్పింది. అలాగే మద్దతు ధర విషయంలో కమిటీ వేస్తామని తెలిపింది. ఈ నిర్ణయాలకు సమ్మతించిన రైతులు తమ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటించాడు. మెళ్ల మెళ్లగా బార్డర్లు ఖాళీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి పూర్తిగా ఖాళీ అవుతుందని అప్పుడు విక్టరీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు రైతులు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఇప్పుడు ఆందోళన ముగింపుకు గుర్తుగా 'హవాన్' నిర్వహించడానికి ఘాజీపూర్ సరిహద్దులోని యూపి గేట్ ఫ్లైఓవర్ వద్ద చివరిసారిగా రైతులంతా గుమిగూడే అవకాశం ఉంది.గతంలో సింఘూ సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులను దేశ రాజధాని వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన దాదాపు అన్ని బారికేడ్లను ఢిల్లీ పోలీసులు మంగళవారం కూల్చివేశారు.
త్వరలో మన దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు
సుదీర్ఘ కాలంపాటు సాగిన ఉద్యమం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని 2020 ఆగస్టు నెల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఆ పోరాటం 2021 డిసెంబర్ వరకు సాగింది. ఈ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు ఈ పోరాటంలో అసువులుబాసారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. అదరకుండా, బెదరకుండా పోరాటం కొనసాగించారు. ఈ నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న లఖింపూర్ ఖేరీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిరసలు తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనపై ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తోంది. ఈరోజు పార్లమెంట్లులో ఈ విషయంలోనే కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఇన్ని ఘటనలు జరిగినా రైతులు ఆత్మస్థైర్యం కోల్పొకుండా తమ నిరసనలు కొనసాగించారు. చివరికి ప్రభుత్వం దిగి వచ్చి కొత్త సాగు చట్టాలు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజుల్లోనే చట్టాలను రద్దు చేసింది. దీంతో రైతులు ఉద్యమం నిలిపివేశారు. ఈరోజుతో ఢిల్లీ బార్డర్లో ఉన్న రైతులందరూ ఇంటికి చేరుకోనున్నారు.