ప్రముఖ ఒడియా సినీ నటి ఝరానా దాస్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి
ప్రముఖ ఒడియా సినీ నటి ఝరానా దాస్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్య కారణాల వల్ల గురువారం రాత్రి మరణించారు. ఆమె అనేక గొప్ప చిత్రాల్లో నటించారు. జయదేవ్ పురస్కార్ అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది.
ప్రముఖ ఒడియా సినీ నటి ఝరానా దాస్ తన 77 ఏళ్ల వయస్సులో తన నివాసంలో గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం ధృవీకరించారు. ఆమె కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపతున్నారు. ఒడియా చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన కృషిని గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జయదేవ్ పురస్కార్’ను అందించింది.
మద్యపానంపై నిషేధమున్న బిహార్లో పోలీసు స్టేషన్లో లిక్కర్ పార్టీ.. ఖైదీలు, అధికారులు కలిసే..!
1945లో జన్మించిన దాస్ 60వ దశకంలో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ‘శ్రీ జగన్నాథ్’, ‘నారీ’, ‘ఆదినామేఘా’, ‘హిసాబ్నికాస్’, ‘పూజఫుల్ల’, ‘అమడబాట’, ‘అభినేత్రి’, ‘మాలజన్హా’, ‘హీరా నెల్లా’ వంటి ల్యాండ్ మార్క్ చిత్రాల్లో అద్భుతమైన నటనకు అనేక ప్రశంసలు అందుకున్నారు.
దాస్ కటక్ లోని ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, అనౌన్సర్ గా కూడా పనిచేశారు. ఆమె కటక్ లోని దూరదర్శన్ లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ జీవిత చరిత్ర డాక్యుమెంటరీలో ఆమె దర్శకత్వం చాలా మంది ప్రశంసలు అందుకుంది.
ఝరానా దాస్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఒడియా చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఒడియా చిత్ర పరిశ్రమకు చేసిన అసాధారణ సేవలతో ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అని పేర్కొన్నారు.
నటి మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఆమె అంతిమ సంస్కారాలను పూర్తి ప్రభుత్వ గౌరవాలతో నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘రంగస్థలం, సినిమాపై ఆమె ప్రభావవంతమైన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అని పట్నాయక్ ఒడియా భాషలో ట్వీట్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దాస్ మృతికి సంతాపం తెలిపారు.