రాజీవ్ హంతకులను వదిలేస్తారా.. కరెక్ట్ కాదు : వెంకయ్య నాయుడు కామెంట్స్
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను వదిలేయడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. దీనిపై తనకు చాలా బాధ కలిగిందని... వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన అన్నారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను వదిలేయడం సరికాదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజీవ్ను హత్య చేసిన వారి పట్ల సానుభూతి అక్కర్లేదన్నారు. ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా వుండాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దీనిపై తనకు చాలా బాధ కలిగిందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు.. రాజకీయాలు వేరని ఆయన అన్నారు.
కాగా... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వారిని విడిచిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వారిని తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు.
1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్, మరో ఐదుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శించింది. కానీ, తమిళనాడు మాత్రం స్వాగతించింది. వీరిపై తమిళుల్లో సానుభూతి ఉన్నది. సానుకూలత ఉన్నది. ఒక పెద్ద కుట్రలో ఈ ఏడుగురిని భాగం చేశారని, అసలు అది ఎంత పెద్ద నేరమో వారికి తెలియదని, వారికి కేటాయించిన పనులు మాత్రమే వారు చేసి పెట్టారని తమిళులు భావిస్తారు.
ఈ కేసులో దోషుల సత్ప్రవర్తనను ఆధారం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు తెలిపింది. ఇటీవలే (మే నెలలో) ఈ కేసు నుంచి ఏజీ పెరారివాలన్ విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా ఆయననూ కోర్టు ప్రస్తావించింది. ఏజీ పెరారివాలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం అనుభవించాడని వివరించింది. అందులోనూ 29 ఏళ్లు ఏకాంత కారాగార వాసాన్ని అనుభవించారని తెలిపింది. ఆయన 19 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లాడు.
ఇకపోతే.. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో 1991 మే నెలలో రాజీవ్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) అనే శ్రీలంకన్ గ్రూప్ హతమార్చింది. ఈ ఆత్మాహుతి దాడిని ఎల్టీటీఈ ప్రతీకార దాడిగా పేర్కొంటూ ఉంటారు. 1987లో శ్రీలంకకు ఎల్టీటీఈని అణచివేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇండియన్ పీస్ కీపర్స్ను పంపించింది. ఈ యుద్దంలో 1,200 మంది మరణించిన తర్వాత వారిని తిరిగి వెనక్కి పిలుచుకుంది. శ్రీలంకలో మానవ హక్కులను దారుణంగా హననం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ పీస్ కీపర్లను అప్పటి భారత కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించుకుంది.