గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన..
ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం, మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేయబోతున్న తరుణంలో ఆయను నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఐబీతో 6 గంటల పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం.. ఉగ్రవాదంపై పోరాటం, దాని మద్దతు వ్యవస్థ పై చర్చ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో కొత్త కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయనని రాష్ట్ర నాయకత్వానికి లేఖ పంపించి, ఢిల్లీకి తెలియజేశానని చెప్పారు. ఈ సారి ఎంపికైన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తాం అని తెలిపారు.
విజయ్ రూపానీతో పాటు గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అలాగే మరో సీనియర్ నాయకుడు భూపేంద్రసింగ్ చూడసామ వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉండటం లేదని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను వరుసగా తొమ్మిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని అననారు. ‘‘ నేను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయను. ఈ విషయం పార్టీ సీనియర్ నాయకులకు చెప్పాను. ఇతర కార్యకర్తలకు అవకాశం కల్పించాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఎన్నికల్లో పోరాడాను. పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ’’ అని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి.. 16 మందికి గాయాలు..
మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్సింగ్ జడేజా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం లేదని చెప్పారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పని చేసేందుకు పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని చెప్పారు. తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అప్పగించే బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు.
కాగా.. గుజరాత్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, బీఎస్ యడ్యూరప్ప, దేవేంద్ర ఫడ్నవీస్, లాల్ సింగ్ రాజ్పురా సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు
కాగా.. 2017 ఎన్నికల్లో గెలుపొందిన 99 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 20 శాతం మందిని బీజేపీ ఈ సారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ తన తొలి జాబితాను గురువారం విడుదల చేయాలని భావిస్తోంది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు కూడా జామ్నగర్ నుంచి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.