భారత సంతతి సీఈవో పరాగ్ అగర్వాల్పై ఎలన్ మస్క్ సెటైర్.. స్టాలిన్తో పోలిక
ట్విట్టర్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన పరాగ్ అగర్వాల్ అమెరికా, భారత్ సహా ఎన్నో దేశాల్లో చర్చను లేవదీశారు. మరో దిగ్గజ సంస్థకు భారత సంతతినే సీఈవోగా ఎన్నికయ్యారన్న చర్చ జోరుగా సాగింది. పరాగ్ అగర్వాల్పై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి స్పందిస్తూ ఏకంగా జోసెఫ్ స్టాలిన్తోనే పోలిక పెట్టారు. ఓ మీమ్ను ట్వీట్ చేస్తూ అందులో జోసెఫ్ స్టాలిన్ బాడీకి పరాగ్ అగర్వాల్ ముఖాన్ని, ఆయన పక్కనే ఉన్న మరో వ్యక్తికి జాక్ డోర్సీ ముఖాన్ని అతికించి ఉన్న ఫొటోనూ ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో(Tesla CEO) ఎలన్ మస్క్(Elon Musk) ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి పరాగ్ అగర్వాల్(Parag Agarwal)పై సెటైర్ వేశారు. ఏకంగా రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్(Joseph Stalin)తోనే పోల్చారు. పరాగ్ అగర్వాల్నే కాదు.. తన పోస్టులో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీనీ పేర్కొన్నారు. అగర్వాల్ను టార్గెట్ చేస్తూ ఆయన ఓ మీమ్ను ట్విట్టర్లో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫ్రీ స్పీచ్కు సంబంధించి గతంలో పరాగ్ అగర్వాల్ చేసిన కామెంట్లకు సెటైర్గా ఎలన్ మస్క్ ఈ పోస్టు పెట్టి ఉంటారని పేర్కొంటున్నారు. జోసెఫ్ స్టాలిన్ బాడీకి పరాగ్ అగర్వాల్ ముఖాన్ని పెట్టగా, ఆయన పక్కనే ఉన్న నికోలాయ్ యెజోవ్ దేహానికి జాక్ డోర్సీ ముఖాన్ని ఉంచిన మీమ్ను మస్క్ ట్వీట్ చేశారు. అయితే, జోసెప్ స్టాలిన్ ఆదేశాల మేరకు తదనంతర కాలంలో నికోలాయ్ యెజోవ్ను హతమార్చిన సంగతి తెలిసిందే.
రెండు ఫొటోలను కలిపి మీమ్గా ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. మొదటి ఫొటోలో పరాగ్ అగర్వాల్, జాక్ డోర్సీలు పక్క పక్కనే నిలిచి ఉండగా, రెండో ఫొటోలో జాక్ డోర్సీ లేడు. పక్కన ఉన్న నదిలో జాక్ డోర్సీ పడిపోయి అదృశ్యమైనట్టుగా చిత్రం ఉన్నది. నదిలో కొన్ని అలలు పైనకు ఎగసిపడినట్టు ఆ మీమ్లో ఉన్నది. గత నెల 29వ తేదీన ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చింది. కాగా, అదే రోజు కొత్త సీఈవోగా భారత సంతతి పరాగ్ అగర్వాల్ను కంపెనీ బోర్డు ఎన్నుకున్నది. అప్పటి వరకు పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా సేవలందించారు. ఐఐటీ బాంబే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు.
Also Read: తనను నిషేధించిన ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సీపై కంగనా కామెంట్.. ఎలన్ మస్క్ స్పందన
కాగా, ఎలన్ మస్క్ ట్వీట్పై చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఇటీవలే ఆయన మార్కెట్లోకి తెచ్చిన సైబర్ విజిల్ చిత్రాన్ని ఉపయోగించుకుని ఎలన్ మస్క్కు కౌంటర్ ఇచ్చారు. ఆపిల్ కంపెనీ వాటి ఉత్పత్తులను శుభ్రపరచడానికి ఇటీవలే మార్కెట్లోకి పోలిషింగ్ క్లాథ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్లాథ్కు అధిక ధర నిర్ణయించింది. ఇదే నేపథ్యంలో ఎలన్ మస్క్ కూడా ఓ సైబర్ విజిల్ను తెచ్చి దానికి అంతకు మించి ధర నిర్ణయించారు.
ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎన్నికైన తర్వాత ఎలన్ మస్క్ స్పందించడం ఇది రెండోసారి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడాబ్, ఐబీఎంపీ, పాలో ఆల్టో నెట్వర్క్స్లకు భారత సంతతి సీఈవోలే ఉన్నారని, ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ సంస్థకూ భారత సంతతినే సీఈవోగా ఎన్నికయ్యారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు రెస్పాండ్ అవుతూ ఎలన్ మస్క్ స్పందించారు. ఇండియన్ ట్యాలెంట్ ద్వారా యూఎస్ఏ ఎంతో లబ్ది పొందుతున్నదని పేర్కొన్నారు.
Also Read: ఇండియా సీఈవో వైరస్కు వ్యాక్సిన్ లేదు.. భారత సంతతి సీఈవోలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
ట్విట్టర్ సంస్థలో చేరక ముందు పరాగ్ అగ్రావాల్ యాహూ, మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్టీ ల్యాబ్స్లో సేవలు అందించారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రీసెర్చ్ టీమ్స్తో కలిసి పని చేశారు. అగ్రావాల్ బీటెక్ డిగ్రీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్స్ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. ట్విట్టర్ అనూహ్యంగా అభివృద్ధి చెందడంలో (సాంకేతికపరంగా) పరాగ్ అగ్రావాల్ టెక్నికల్ స్ట్రాటజీ కీలకంగా ఉన్నది. ఆయనను ట్విట్టర్ సీఈవోగా ఎన్నుకోవడంపై పరాగ్ అగ్రావాల్ హర్షం వ్యక్తం చేశారు.