తనను నిషేధించిన ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సీపై కంగనా కామెంట్.. ఎలన్ మస్క్ స్పందన
ట్విట్టర్ సంస్థ సీఈవో బాధ్యతలకు నిన్న జాక్ డోర్సీ రాజీనామా చేశారు. ఆ రాజీనామా వెంటనే అమల్లోకి రావడమే కాదు.. కంపెనీ బోర్డు సభ్యులు వెంటనే నూతన సీఈవోగా భారత సంతతి పరాగ్ అగ్రావాల్ను ఎన్నుకుంది. ఈ మార్పుపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. ట్విట్టర్ సంస్థ కంగనా రనౌత్పై శాశ్వత నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె బై చాచా జాక్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతేకాదు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసిన రియాక్షన్ కూడా చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) నిబంధనలు తరుచూ ఉల్లంఘించారనే ఆరోపణలపై కంగనా రనౌత్(Kangana Ranaut)పై శాశ్వత సస్పెన్షన్(Suspension) ఆ సంస్థ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ట్విట్టర్లో కనిపించడం లేదు. అందుకే ఆమె అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు అన్ని ఇప్పుడు ఎక్కువగా Instagramలో షేర్ చేస్తున్నారు. అయితే, ఆమెపై శాశ్వత సస్పెన్షన్ విధించినప్పుడు ఆ సంస్థ సీఈవోగా జాక్ డోర్సీ(Jack Dorsey) ఉన్నారు. కానీ, ఆయన నిన్న సీఈవో బాధ్యతలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే, ఈ రాజీనామాపై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. జాక్ డోర్సీ స్థానాన్ని బాంబే ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగ్రావాల్ అధిరోహించారన్న ఓ ట్వీట్ స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె పోస్టు చేశారు. దానిపై ‘బై చాచా జాక్’ అంటూ రాశారు.
పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆమె ట్విట్టర్లో పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ట్వీట్లు సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పలుసార్లు ఆ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ ఆమె అదే తీరులో ట్వీట్లు చేశారు. దీంతో ఆమెను ట్విట్టర్ వేదిక నుంచి శాశ్వతంగా సస్పెన్షన్ విధించారు. కంగనా రనౌత్ చాలా సార్లు సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందున ఆమెను ఈ వేదిక పై నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు. ట్విట్టర్ వేదికపై చేసే వ్యాఖ్యలు వాస్తవ సమాజంలో అలజడి రేపే విధంగా ఉంటే వాటిపై తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంగనా రనౌత్ పలుసార్లు నిబంధనలు ఉల్లంఘించారని, ముఖ్యంగా విద్వేషపూరిత వ్యవహారానికి సంబంధించిన నిబంధనలు ఆమె చాలా సార్లు ఉల్లంఘించారని పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Also Read: అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలుగా భారతీయులు.. జాబితా ఇదే
ట్విట్టర్ విధించిన సస్పెన్షన్పై కంగనా రనౌత్ మండిపడ్డారు. ఈ సస్పెన్షన్ మాటలకు అందని వేదన కలిగిస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ప్రభుత్వానికి ఇది ఒక ముఖ్య సందేశమని తెలిపారు. తనపై నిషేధం జాతి వివక్ష అని ఆమె ఆరోపణలు చేశారు. వారంతా పుట్టుకతో అమెరికన్లు అని, శ్వేత జాతీయులు కేవలం వాళ్ల ఆలోచనల్లోనే ఇతరులు మసలు కోవాలని భావిస్తుంటారని, వారికి నచ్చినట్టుగానే ఇతరుల నడవడిక ఉండాని యోచిస్తారని పేర్కొన్నారు. అందుకే తనపై నిషేధం అమలైందని తెలిపారు. కానీ, తనకు ఇతర సామాజిక మాధ్యమాలు ఉన్నాయని, అక్కడ తన గళాన్ని ఎత్తుతారని వివరించారు.
Also Read: మరో వివాదంలో కంగనా.. ఎఫ్ఐఆర్ దాఖలు.. ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ పిక్తో ‘నా మూడ్’ ఇలా ఉందంటూ పోస్టు
కాగా, ట్విట్టర్ సీఈవో మార్పుపైనే టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ స్పందన కూడా చర్చనీయాంశమైంది. జాక్ డోర్సీ తర్వాత ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి పరాగ్ అగ్రావాల్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. భారత సంతతి టెక్నాలజీ ప్రపంచంలో అజేయులుగా నిలుస్తున్నారని తెలిపారు. వలసలు వచ్చిన వారికి అమెరికా అందిస్తున్న సువర్ణావకాశాలను ఇది మరోసారి గుర్తు చేస్తున్నదని వివరించారు. కాగా, ఈ ట్వీట్కు రియాక్షన్గా ఎలన్ మాస్క్ స్పందించారు. ఇండియన్ టాలెంట్ ద్వారా అమెరికా ఎంతో లబ్ది పొందుతున్నదని ట్వీట్ చేశారు.