ట్విట్టర్ డీపీ మార్చిన ఏక్ నాథ్ షిండే.. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వానికి దావా..
మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చారు. శివసేన దివంగత నాయకుడు బాలాసాహెబ్ ఠాక్రే తో ఆయన ఉన్న ఫొటోను డిపీగా సెట్ చేశారు.
ఎన్నో మలుపులు తిరగిన మహారాష్ట్ర రాజకీయాలు గురువారం సాయంత్రం ఒక కొలిక్కి వచ్చాయి. మహారాష్ట్ర సీఎంగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తో పాటు బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏకనాథ్ షిండే తన ట్విట్టర్ డీపీని మార్చారు. బాలాసాహెబ్ ఠాక్రే పాదాల దగ్గర కూర్చున్న తన ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ చేశారు.
బాలాసాహెబ్ తో ఉన్న ఫొటో డీపీగా మార్చి మహారాష్ట్ర ప్రజలకు షిండే పెద్ద సందేశం ఇచ్చారు. నిజానికి షిండే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ బాలాసాహెబ్ హిందుత్వం గురించి పదే పదే మాట్లాడేవారు. మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే సూరత్ ను విడిచిపెట్టిప్పటి నుంచి ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ తో కలిసి అసహజ పెట్టుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచనలు, హిందుత్వంతో ఉద్దవ్ ఠాక్రే రాజీ పడ్డారని విమర్శించారు. బాలాసాహెబ్ ఎప్పుడూ కాంగ్రెస్, ఎన్సీపీకి వ్యతిరేకంగా పోరాడేవారని, అయితే ఉద్ధవ్ వారితోనే చేతులు కలిపారని షిండే చెప్పారు.
కాగా ఏక్ నాథ్ షిండే తన వర్గాన్ని నిజమైన శివసేనగా, తామే శివసైనికులమని పదే పదే ప్రకటించుకున్నారు. తామే బాలాసాహెబ్ సూత్రాలను పాటిస్తున్నామని అన్నారు. శివసేనకు బీజేపీతో సహజంగానే పొత్తు ఉందని, మరే ఇతర పార్టీతో పొత్తుపెట్టుకోవడం అంటే బాలాసాహెబ్ ఆలోచనలకు దూరంగా ఉండడమేనని షిండే ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ట్విట్టర్ డీపీ మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫొటో పెట్టడం ద్వారా తామే బాలసాహెబ్ కు అసలైన వారసులం అనే వాదనను ప్రజల్లోకి బలంగా పంపించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉదయ్ పూర్ ఘటనకంటే వారం ముందే.. మహారాష్ట్రలో మరో ఘటన..? అనుమానంతో దర్యాప్తు ముమ్మరం..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో కూడా మహావికాస్ అఘాడి ప్రభుత్వంలో పనిచేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని షిండే ఆరోపించారు. బాలాసాహెబ్ హిందుత్వంతో ఉద్దవ్ ప్రభుత్వం రాజీపడుతోందని అన్నారు. ఇదే సమయంలో ఎంవీఏ ప్రభుత్వం రెండు నగరాల పేర్లు మార్చడం తొందర పాటు చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఏక్ నాథ్ షిండేకు హిందుత్వ అంశంపైనే మద్దతు ఇస్తున్నానని, అధికార దాహంతో కాదని చెప్పారు. ప్రభుత్వం శివసేన ఎమ్మెల్యేల మాట వినడం లేదని, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేల మాటకు ప్రాధాన్యత ఉంటోందని అన్నారు.
గత కొన్ని రోజులుగా జరిగిన ఈ రాజకీయ పోరాటం మొత్తం హిందుత్వం అంశం చుట్టూనే తిరిగింది. బాలాసాహెబ్ ఆలోచనలు పదే పదే చర్చకు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బాలాసాహెబ్ హిందుత్వం తో తాను ఏ విధంగానూ రాజీపడబోనని ఆయనతో ఉన్న ఫొటో పెట్టి ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర వాసులకు పెద్ద సందేశం పంపించారు. మరి మొత్తంగా శివసేనకు ఉన్న 55 మంది ఎమ్మెల్యేలో షిండేకు 39 మంది మద్దతు ఉంది. ఠాక్రే బృందంలో 15 మంది మిగిలి ఉన్నారు. మరి చివరికి శివసేన ఎవరికి సొంతమవుతుందో ? పార్టీలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాలంటే మరి కొంత కాలం ఎదురుచూడాల్సిందే.