ఈ నెల 30న డ్రై డే.. ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఎందుకో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30వ తేదీన చత్ పూజా సందర్భంగా డ్రై డేని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఈ నెల 30న డ్రై డేగా ఢిల్లీ లెఫ్టినెంట్ వినయ్ కుమార్ సక్సేనా ప్రకటించారు. దేశ రాజధానిలో ఈ ఆదివారం డ్రై డే అమలవుతుందని ప్రకటించారు. ఈ నెల 30న చత్ పూజా చేపట్టనున్నారు. ఈ చత్ పూజాను పురస్కరించుకుని ఆదివారం డ్రై డే పాటించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ 2009లోని సెక్షన్ 2 (35) కింద గవర్నమెంట్గా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ అధికారం ఉపయోగించుకుని ఆయన ఆదివారం డ్రై డేగా ప్రకటించినట్టు తెలిపారు.
ఈ రోజే బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఈ మేరకు అభ్యర్థించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆదేశ్ గుప్తా ఓ లేఖ రాశారు. ఢిల్లీ రాజధానిని, అలాగే పండుగ పవిత్రతనూ నిలుపడానికి చత్ పూజా రోజున డ్రై డేగా ప్రకటించాలని అందులో కోరారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ప్రకటించగానే.. ఆయన ట్విట్టర్లో ఎల్జీకి ధన్యవాదాలు తెలిపారు. పూర్వాంచల్ ఏరియా ప్రజలకు ఇది ఒక విజయవంతమైన రోజు అని వివరించారు.
Also Read: డ్రైడే రోజు చిల్డ్ బీర్ ఆర్డర్ చేసిన టెక్కీ... ఫలితంగా..
ఢిల్లీ కాంగ్రెస్ కూడా బుధవారం ఇలాంటి ఓ అభ్యర్థనే చేసింది. చత్ పూజా రోజున పబ్లిక్ హాలీడే ప్రకటించాలని, లేదంటే డ్రై డే ప్రకటించాలని కోరింది. అదే రోజున యమునా నదీ తీరంలో నిర్దేశిత ఘాట్లపై పూజలు చేసుకోవచ్చని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రకటించారు. అదే విధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టించరాదని సూచించారు. కేజ్రీవాల్ చేసిన ట్వీట్ యమునా నదీ తీరంలో ఎక్కడైనా పూజలు చేసుకోవచ్చనే సూచనలు ఇస్తున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు వివరించాయి. కాగా, సీఎం కేజ్రీవాల్కు సూచనలు చేస్తూ చీప్ లాంగ్వేజ్ వాడారని ఆప్ విమర్శించింది. ఆయనకు ఎప్పుడూ చీప్ పబ్లిసిటీ కావాలని ఆరోపణలు చేసింది.
ఈ నెల 30వ తేదీ, 31వ తేదీన చత్ పూజా చేస్తారు. బిహార్, ఉత్తరప్రదేశ్ తూర్పు భాగంలో ఈ పండుగకు ఎక్కువ ఆదరణ ఉన్నది.