ఆంధ్రప్రదేశ్కు HAL తరలిస్తారన్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగనివ్వబోమని… రాష్ట్ర ఆస్తులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (HAL) ను కేంద్ర ప్రభుత్వం కర్ణాటక నుండి ఆంధ్ర ప్రదేశ్ కు తరలించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిల్లీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన తర్వాత ఈ ప్రచారం జోరందుకుంది. దీనిని కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఖండించారు.
కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన డికె శివకుమార్.. "HALను ఈ బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేశారు. మేము HALకి తగినంత భూమిని ఇచ్చాము, తుమకూరులో హెలికాప్టర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా భూమిని అందించాము'' అని తెలిపారు.
‘’చంద్రబాబు నాయుడు కేంద్రానికి చేసిన రాజకీయ విజ్ఞప్తిలో నేను జోక్యం చేసుకోవడం లేదు. వారు ఏపీలో కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. మేము దానికి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ మా రాష్ట్ర ఆస్తులను కాపాడుకోడానికి మా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో HAL ను తరలిస్తే ఊరుకోబోం" అని డికె శివకుమార్ అన్నారు.
HAL తరలింపు ప్రచారంపై కర్ణాటక బిజెపి ఎంపీల మౌనంపై కూడా డికె శివకుమార్ ప్రశ్నించారు. "కర్ణాటకను ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఎంపీలు ఏం చేస్తున్నారు? HALను ఆంధ్రప్రదేశ్కు తరలించడం గురించి కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. వారు రాష్ట్రం కోసం మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.
మైసూర్ శాండల్ సబ్బుకు నటి తమన్నా భాటియాను మోడల్గా నియమించడంపై కూడా శివకుమార్ మాట్లాడుతూ.. "నేను సీఎం, పరిశ్రమల మంత్రితో ఈ విషయం గురించి మాట్లాడతాను. గతంలో బల్బుల విషయంలో ఇలాంటి చర్చ జరిగింది. దానికోసం మేము పునీత్, రమ్యలను నియమించాము. అటవీ శాఖకు అనిల్ కుంబ్లేను రాయబారిగా చేయాలని కూడా చర్చిస్తున్నాము" అని అన్నారు.
ఇక కాంగ్రెస్ లో చేరికలపై కూడా డికె శివకుమార్ స్సందిస్తూ…''సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తోంది. అందువల్లే చాలామంది బీజేపీ, జెడిఎస్ నాయకులు పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. మా పార్టీలో చేరాలనుకునే నాయకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పాత, కొత్త నాయకులంతా కలిసి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలి" అని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సూచించారు.