ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. 

Nara Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప మహానాడులో ఆసక్తికర కామెంట్స్ చేసారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రూ.500 కంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లేమీ చెలామణిలో ఉండకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు ఏపీ సీఎం.

పెద్దనోట్లను రద్దుచేసి డిజిటల్ కరెన్సీని బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రాన్ని సూచించారు. అప్పుడే నల్లధనం బైటపడుతుందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా టిడిపికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు ఈ డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని.. తాము పారదర్శకంగా ఉంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా తమ ఫోన్ల ద్వారానే విరాళాలు అందివ్వాలని చంద్రబాబు కోరారు.

తెలుగుదేశం పార్టీ, తమ ప్రభుత్వం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే నాయకులు, కార్యకర్తలకు పదవులు దక్కుతాయి... ఇకపై అధికారుల పనితీరుపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ఇలా ప్రజల చేతిలోనే పాలన పెట్టామన్నారు చంద్రబాబు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ముందున్నారని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రజలకు అవినీతి లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు వాట్సాఫ్ గవర్నెన్స్ తీసుకువచ్చామన్నారు... దీన్ని గేమ్ చేంజర్ గా చంద్రబాబు పేర్కొన్నారు. చేతిలోని మొబైల్ నుండి వాట్సాప్ మేసేజ్ చేస్తే చాలు పని అయిపోతుంది... దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గుతుందన్నారు.

 

Scroll to load tweet…

 

వైసిపి ప్రభుత్వ అక్రమాలపై కూటమి బైటపెడుతోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు అవినీతి చేసారో అందరిచేత తిన్నదంతా కక్కిస్తామని.. ఇది ఎన్డిఏ ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత తానే స్వయంగా చూస్తానన్నారు. తప్పుచేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన అందిస్తామని పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంచుతామన్నారు. కూటమిగా కలిసి నడుస్తాం... కలిసి గెలుస్తాం.. జనసేన, బిజెపిని కలుపుకుపోవడంలో టిడిపి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ రాష్ట్రాన్ని విజన్ తో ముందుకు తీసుకువెళతాం..పొలిటికల్ గవర్నెన్స్ అందిస్తామన్నారు. కొండను కూడా ఢీకొట్టే శక్తి మీరు నాకు ఇస్తున్నారంటూ టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి అధినేత చంద్రబాబు కామెంట్ చేసారు.