న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం- సీజేఐ రమణ
న్యాయ వ్యవస్థ పై విశ్వాసం సన్నగిల్లడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యం ప్రజలకు న్యాయం చేయడమేనని ఆయన చెప్పారు.
న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయ వ్యవస్థ పతనం కాకుండా చూసుకోవాలని తెలిపారు. శుక్రవారం ఏపీలోని విజయవాడలో కోర్టు కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు, ఇతర న్యాయస్థానాల న్యాయమూర్తుల హాజరయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్ష పోస్టుకు రాహుల్ గాంధీ ‘నో’.. ప్రియాంక గాంధీకి బాధ్యతలు?
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీపై దృష్టి సారించానని అన్నారు. 250 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని చెప్పారు. తన ఏడాదిన్నర పదవీ కాలంలో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తన ఎజెండాలో రెండు అంశాలని సీజేఐ చెప్పారు.
హైకోర్టులకు 250, అలాగే సుప్రీంకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల హైకోర్టులకు 15 మంది ప్రధాన న్యాయమూర్తులను కూడా నియమించామని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు, ప్రత్యేకించి మహిళలు, వెనుకబడిన వర్గాలకు న్యాయవ్యవస్థలో సరైన ప్రాతినిధ్యం లభించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయస్థానాల్లో మౌలిక వసతుల మెరుగుదల తదితర అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులకు విన్నవించినట్లు చెప్పారు.
చంబల్ లోయలో కాదు.. విధానసౌధలోనే దోపిడీ దొంగలు: బీజేపీ నేతలపై కుమారస్వామి వ్యాఖ్యలు
కొన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల దృష్ట్యా కోర్టు భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాల్సిన అసవరం ఉందని అన్నారు. కేంద్రం నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా కొందరు ముఖ్యమంత్రులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని, మద్దతు ఇచ్చిన్నందుకు ధన్యవాదాలని చెప్పారు.
అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయని, ఇదే న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని జస్టిస్ రమణ అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. సత్వర న్యాయం జరిగేలా చూడటం న్యాయమూర్తులు, న్యాయవాదుల బాధ్యత అని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యం ప్రజలకు న్యాయం చేయడమేనని, సాధ్యమైనంత తక్కువ సమయంలో సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.న్యాయవ్యవస్థ బలోపేతానికి వివిధ కార్యక్రమాలకు అన్ని విధాలా సహకరించాలని న్యాయవాదులకు సూచించిన ఆయన 1983లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యునిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
దాదాపు దశాబ్దం క్రితం తాను శంకుస్థాపన చేసిన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ తెలిపారు. నిర్మాణ జాప్యానికి రాష్ట్ర విభజన ఒక కారణమని, ఆర్థిక సమస్యల కారణంగా ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయలేకపోతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లు పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని చెప్పారు. తాను సీజేఐగా ఉన్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరిగాయని, మరి కొన్ని ఖాళీలు ఉన్నాయని, వాటి భర్తీకి కృషి చేయాలని సీఎంను, ఏపీ ప్రధాన న్యాయమూర్తిని కోరారు.న్యాయవ్యవస్థ చేపట్టిన కార్యక్రమాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.