చంబల్ లోయలో కాదు.. విధానసౌధలోనే దోపిడీ దొంగలు: బీజేపీ నేతలపై కుమారస్వామి వ్యాఖ్యలు
కర్ణాటక బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి. దోపిడీ దొంగలను చూడాలంటే చంబల్ లోయకు వెళ్లాల్సిన పనిలేదని, బెంగళూరుకు వస్తే విధానసౌధలోనే కనిపిస్తారంటూ చురకలు వేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెడీ కుమారస్వామి. శుక్రవారం రాయచూరు జిల్లా మాన్వి ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ జన్మదిన వేడుకల్లో కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీ దొంగలను చూడాలంటే చంబల్ లోయకు వెళ్లాల్సిన పనిలేదని, బెంగళూరుకు వస్తే విధానసౌధలోనే కనిపిస్తారంటూ చురకలు వేశారు.
బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి ఎలా కుదిరితే అలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కుమారస్వామి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పూర్తి మెజార్టీని కట్టబెడితే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాజీ సీఎం హామీ ఇచ్చారు. రైతులు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించలేకపోతే తాము పార్టీనే రద్దు చేస్తామని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ALso Read:National Herald Case: ఆ కేసులో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు: హెచ్డి కుమారస్వామి
ఇకపోతే.. రాహుల్ గాంధీ ఈడీ విచారణపై జూన్ నెలలో కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పదే పదే ప్రశ్నిస్తూ వేధింపులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీని నిరంతరం విచారణకు పిలుస్తున్నారనీ, ఇప్పటికే ఐదు రోజులు విచారించారని తెలిపారు. అన్ని రిజిస్ట్రేషన్లు, సమాచారం ED అందుబాటులో ఉన్నాయనీ, వారు అన్ని విచారణలను అరగంటలో ముగించగలరని అని కుమారస్వామి అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం రాజకీయ ప్రాతిపదికన జరిగిందని ఆయన ఆరోపించారు.
అలాగే సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్ స్కీం పై కుమార స్వామి మాట్లాడుతూ.. విమర్శాస్త్రాలు సంధించారు. అగ్నిపథ్ అమలు వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించారు. సైన్యంపై పట్టు సాధించేందుకు బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆరెస్సెస్ ప్రతిపాదించిన పథకమే అగ్నిపథ్ అని అన్నారు. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ పార్టీ.. సైన్యంపై పట్టు సాధించినట్లే.. ఆరెస్సెస్ కూడా అలాగే ప్రయత్నిస్తున్నదా? అని ప్రశ్నించారు.